కలెక్టర్ తెచ్చిన చైతన్యం..! ఓట్ల శాతం పెంచడానికి వినూత్న కృషి..!!
హైదరాబాద్ : కర్తవ్య నిర్వహణతో పాటు సామాజిక స్ప్రుహ ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు. యాంత్రికంగా పనిచేసుకుంటూ పోవడం వేరు పనిలో నూతనత్వాన్ని చాటుకోవడం వేరు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా జిల్లా కలెక్టర్ చూపించిన చొరవ అందరిచేత ఔరా అనిపించింది. ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, పోలింగ్ శాతం పెంచడం, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ సమర్థంగా నిర్వహించడం వంటి పనులన్నీ కూడా కత్తిమీద సాములాంటివే. వీటిని నిర్వర్తించే క్రమంలో వినూత్న పద్ధతుల్ని అనుసరించారు ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్. ఆ ప్రయత్నమే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
సమర్థవంతంగా పనిచేసిన కలెక్టర్..! గుర్తింపునిచ్చిన ఎన్నికల సంఘం..!!
సమర్థంగా పనిచేసిన అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరికి పురస్కారాలను ప్రకటించగా అందులో ఆమె ఒకరు. ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ సాఫీగా నిర్వహించడంలో దివ్య తనదైన ముద్ర వేశారు. ఓటరు నమోదు, పోలింగ్ శాతం పెరిగేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పిల్లలతో తల్లిదండ్రులకు లేఖలు రాయించడం, నిజాయతీగా ఓటేసేందుకు టెలిఫిల్మ్ ప్రదర్శనలతో ఊరూ వాడా విస్త్రృత ప్రచారం చేయించారు.
ఎన్నికలపై పల్లెల్లో చైతన్యం..! వ్యక్తిగత ఆసక్తి కనబరిచి కలెక్టర్..!!
అధికార యంత్రాంగం ప్రతి పల్లెకు వెళ్లి వీవీప్యాట్, ఈవీఎంలతో ఓటు వేయడం ఎలాగో అవగాహన కల్పించేలా చేశారు. వైకల్యంతో ఓటుకు దూరంగా ఉండే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక రవాణా, వసతులు కల్పించి పోలింగ్ కేంద్రాలకు రప్పించారు. ఫలితంగా 2014 శాసనసభ ఎన్నికల్లో 71.93శాతం పోలింగ్ నమోదైతే... ఈసారి ఎన్నికల్లో 83.49 శాతానికి పెరిగింది.
ఎన్నికలపై డెమో..! నిరక్షరాసుల్లో చైతన్యం తీసుకొచ్చిన అదికారి..!
ఎన్నికల సమయంలో ప్రలోభాలను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబరును సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయంలో పోలీసు, అబ్కారీ, ఆదాయ పన్ను శాఖలను భాగస్వాములను చేసి సమన్వయపర్చడంలోనూ ప్రత్యేక చొరవ చూపి భారీగా నగదు, మద్యం పట్టుకోగలిగారు. సాధారణంగా ఎన్నికల సిబ్బంది అనగానే వారికి విధులు అప్పగించడమే తప్ప వారి బాగోగులను పట్టించుకోరనే విమర్శ ఉంటుంది.
అన్ని రంగాల్లో చొరవ చూపిన ఆదిలాబాద్ కలెక్టర్.! ఓటింగ్ శాతం పెరుగుదల..!
కానీ వారి సంక్షేమం కోసం అత్యవసర మందులు, దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్, టార్చిలైట్, సబ్బు, టూత్పేస్ట్, మినరల్ వాటర్ వంటివన్నీ కలిసి ఉండేలా ఓ కిట్ను రూపొందించారు. వాటిని ఎన్నికల విధుల్లో పాల్గొన్న సుమారు 2372 మంది సిబ్బందికి అందజేశారు. ఇవన్నీ ఆమెకు సమర్థ పాలనాధికారిగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అంతేనా తాజాగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో అందించిన సేవలకు కూడా ఎన్నికల సంఘం రాష్ట్రస్థాయి రివార్డును అందజేసింది.