సాహసోపేత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్..! అసహనానికి లోనై బదిలీ వేటు వేసిన టీ సర్కార్..!!
హైదరాబాద్: కొన్ని సందర్బాల్లో నామమాత్రపు వ్యాఖ్యలకు ఊహించని శిక్షలు ఎదురౌతుంటాయి. ఒక్క దెబ్బతో పని చేయాలన్న ఉత్సాహం మొత్తం మంటగలిసిపోతుంది. ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. తెలంగాణలో అచ్చం ఇలాంటీ సంఘటనే చోటుచేసుకుంది. ఆయన ప్రపంచ బ్యాంకులో పనిచేశాడు. ప్రభుత్వంలో నిజాయితీగా విధులు నిర్వర్తించాడు. పేదల పక్షాన నిలబడి వారికి సంక్షేమ పథకాలు అందేలా జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.
ఆయన మాట్లాడిన ఒక్క మాటతో జిల్లా కలెక్టర్ పదవి ఊడబెరికి హైదరాబాద్ కు బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అక్కడి నుంచి మొదలు ఆయన ప్రాధాన్యత లేని పోస్టులో కొనసాగుతున్నారు. ఆయనే ఆకునూరి మురళి. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ కు అనుమతించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే. జోషీకి దరఖాస్తు సమర్పించారు.భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో టీబీ కార్యక్రమంపై అవగాహన శిబిరం జరిగింది.
అటవీ ప్రాంతంలో జరిగిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ టీబీ పేషెంట్లు ఎద్దు మాంసం తింటే త్వరగా వ్యాధి త్వరగా తగ్గుతుందని అన్నారు. తినేవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలకు కొందరు పెడార్థాలు తీసి సీఎం కేసీఆర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై వేటు పడింది. అక్కడి నుంచి బదిలీ చేసి ఆర్కియాలజీ విభాగానికి బదిలీ చేశారు. పనీ పాటలేని డిపార్ట్ మెంట్ లో పనిచేయడం కన్నా వీఆర్ఎస్ పెట్టుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన మురళీ దరఖాస్తు సమర్పించారు.
తెలంగాణ లో బడుగు, బలహీన వర్గాల ఐఏఎస్లకు ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వడం లేదన్నది వాస్తవమేనన్నది బదిలీలను బట్టి తెలుస్తున్నదని మురళీ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ అధ్వాన్నంగా ఉందని అన్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు సరిగా లేవని మురళీ అన్నారు.