వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!
హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పూర్తి స్థాయిలో సహకరించారని ఘాటుగా విమర్శించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి. గత వారం రోజులగా ఇదే అంశంపే ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయిలో నడుస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి మరింత లోతుగా మాట్లాడారు. ఈ అవినీతి బాగోతాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేసారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి గురించి స్పందించమంటే విద్యుత్ ఉద్యోగులను రెచ్చగొట్టడం ప్రభాకర్ రెడ్డికి ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను బహిర్గతం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
మరింత రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్ధలతో జరిగిన అవినీతిని ఎండగడతానన్న ఎంపి..!!
విద్యుత్ సంస్థలను దివాళా తీయించి దోపిడీకి పాల్పుడుతున్నారని తెలంగాణ సర్కార్ పై రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్ లను సిఎండీలుగా నియమించేవారని పేర్కొన్నారు. కానీ ఐఏఎస్ అడ్డగోలు ఒప్పందాలపై సంతకాలు పెట్టకపోవడంతో వారిని తొలగించి రిటైర్డ్ అయిన వారిని నియమించారని ఘాటు విమర్శలు చేసారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావు, రఘుమరావు, గోపాల రావు లను సిఎండీలుగా నియమించారని ఆరోపించారు. అంతే కాకుండా చట్టంలో లేని పదవులను సృష్టించి, పనికి రాని స్థాయిని వారికి కల్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రశేఖర్ రావు దోపిడీకి వారు సహకారం అందించారన్నారు రేవంత్ రెడ్డి.
ట్రాన్స్ కో సీఎండీ సమర్ధుడు కాదు..! ఆ పదవులకు చట్టబద్దత లేదన్న రేవంత్ రెడ్డి..!!
2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంస్థలు 74 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చాయని, కానీ 35కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చామని ప్రభాకర్ రావు అనడం పచ్చి అబద్ధమన్నారు. చిత్త శుద్ధి ఉంటే ప్రభాకర్ రావు దీని పై వివరాలు బయటపెట్టాలన్నారు. ప్రభాకర్ రావు నీతి మంతుడా? ఆయనకు కొంత మంది చెంచాలు మద్దతు ఇవ్వడమా? ప్రభాకర్ రావు సమర్థవంతుడైతే తక్కువ ధరకు విద్యుత్ తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణ డిస్కంలు యూనిట్ విద్యుత్ ను 7.10 రూపాయలకు సరఫరా చేస్తాం అనడాన్ని దక్షిణ మధ్య రైల్వే తప్పుపడుతూ లేఖ రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల విద్యుత్ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందని రేవంత్ రెడ్డి నిలదీసారు.
అవినీతిలో భాగస్వామ్యం కోసమే పదవులు..! అన్ని లెక్కలు తీస్తానన్న కాంగ్రెస్ ఎంపీ..!!
కరెన్సీ కట్టల కోసం చంద్రశేఖర్ రావు విద్యుత్ సెంటిమెంట్ ను వినియోగించుకుంటున్నారని, ప్రభాకర్ రావు ను సిఎండి గా నియమించడానికి అర్హత లేదని, అర్హతలేని ప్రభాకర్ రావు కింద పనిచేయలేక సమర్ధవంతమైన ఐఎఎస్ లు బదిలీలు చేసుకుని వెళుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని రేవంత్ స్పష్టం చేసారు. విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజీ, రమేష్ లు చేస్తోన్న పనులు ఏంటో తెలుసు నని, వారిద్దరు చిన్న పిచుకలు మాత్రమేనని అభివర్ణించారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతున్నారని విద్యుత్ జేఏసీ నేత రఘు మీద మాట్లాడకుండా ఆంక్షలు పెట్టారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
కావాలనే ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు..! వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్న రేవంత్ రెడ్డి..!!
ఇదే తెలంగాణ ప్రభుత్వం రఘు మీద నిషేధం విధించినప్పుడు ఈ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడలేదని, మరి నిన్న ఉద్యోగులు సెలవులు పెట్టి ధర్నాలు చేశారా అని రేవంత్ ప్రశ్నించారు. చెన్నూరులో ఒక అధికారి చంద్రశేఖర్ రావు, కేటీఆర్ మీద మాట్లాడితే చర్యలు తీసుకున్నారని, మరి నిన్న రొడెక్కి అంతమంది ఉద్యోగులు తన గురించి మాట్లాడితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగులు చంద్రశేఖర్ రావు మీద మాట్లాడితే ఒక నీతి, తమ మీద మాట్లాడితే ఒక నీతా అని ప్రశ్నించారు. ఇక చంద్రశేఖర్ రావు అనుకూల వ్యతిరేక వర్గాలుగా బీజేపీ చీలిపోయిందని, చంద్రశేఖర్ రావు ను వ్యతిరేకించేవారికి బీజేపీలో స్థానం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి వివరించారు.