హుజుర్నగర్ ఉప ఎన్నిక మద్దతు ఉపసంహరించుకోనున్న సీపీఐ...?
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు పలికిన సీపిఐ యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హుజుర్నగర్ ఉప ఎన్నిక మద్దతుతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కూడ చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సోమవారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల మద్దతు పై పునర్నిర్ణయం తీసుకోనుంది. కార్యవర్గ సమావేశం అనంతరం హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఉపసంహరించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించనుంది.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనపై మద్దతు తెలుపుతున్న సీపిఐ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి మూడు రోజుల డెడ్లైన్ పెట్టింది. సమ్మెపై నిర్ణయం తీసుకోకపోతే.. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పింది. అయితే ప్రభుత్యం మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారు చేస్తున్న సమ్మె చట్టవిరుద్దమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు మూడు రోజుల్లో వందశాతం బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో కార్మికుల పక్షాన నిలబడే సీపిఐ కూడ తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్దమైంది. మరోవైపు హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు మద్దతు పలికిన నేపథ్యంలోనే ఆ పార్టీ అనేక విమర్శలను కూడ ఎదుర్కోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడ సీపీఐ చేసిన డిమాండ్ను కూడ పట్టించుకోకపోవడంతో సోమవారం జరగనున్న కార్యవర్గ సమావేశంలో మద్దతు ఉపసంహరణపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.