నగర శివార్లలో ప్రమాద ఘంటికలు..! ఎంజాయ్ విత్ గంజాయి అంటున్న యూత్..!!
యాదాద్రి/హైదరాబాద్ : యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు గంజాయి దందాకు తెరలేపారు. ఒకప్పుడు పచ్చని పంటలు, ద్రాక్ష, మామిడి తోటలు, పాడిపంటలతో ఉన్న శివారు గ్రామాలు, విస్తరిస్తున్న నగరీకరణ తొలి అడుగులోనే ఇలా గంజాయి దందాలతో నేరపూరితమవుతున్నాయి. ఇటీవల హాజీపూర్లో వెలుగుచూసిన ముగ్గురు అమ్మాయిల హత్యలకు సైకో శ్రీనివాస్ రెడ్డి, గంజాయి అలవాటున్న అతడి స్నేహితులే కారణమని విశ్లేషణలు వస్తుండడంతో శివార్లలో గంజాయి దందా ఆందోళన కలిగిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి దారుణాలతో వార్తల్లో నిలిచిన హాజీపూర్లోనే కొంతమంది గంజాయికి బానిసలయ్యారు. మల్యాల, మైసిరెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లోనూ యువత గంజాయికి బానిసలయ్యి తప్పు దారి పట్టినట్టు తెలుస్తోంది.
గంజాయి ఎక్కువగా దొరికే కేంద్రాలు ఇవే..! బానిసలవుతున్న యువత..!!
మేడ్చల్ జిల్లాలోని గ్రామీణ మండలాలు కీసర, శామీర్పేట, ఘట్కేసర్.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెండేళ్లుగా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. అప్పట్లో గంజాయిని పీల్చడంతో మొదలైన వ్యసనం కొందరికైతే శ్రుతిమించి డ్రగ్ ఇంజక్షన్లు తీసుకునే దాకా చేరిందని తెలుస్తోంది. శివారు గ్రామాల్లో జులాయిగా తిరిగే యువత విచ్చలవిడిగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగిస్తున్నట్లు రుజువయ్యింది. పదో తరగతి ఫెయిల్ అయి, ఇంటి వద్దే ఉంటున్న యువత ఎక్కువగా ఈ గంజాయి బారిన పడి, మత్తులో జోగుతున్నారని బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన ఒక పార్టీ నాయకుడు చెప్పారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోనే గంజాయికి బానిసైన యువకులు 160మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు.
శివార్లలో గంజాయి శివాలు..! యువతను పీల్చేస్తున్న రక్కసి..!!
మండల పరిధిలోని మల్యాల, హాజీపూర్, మైసిరెడ్డిపల్లి వంటి చిన్న పల్లెల్లోనూ పదుల సంఖ్యలో యువత గంజాయిని పీల్చుతున్నారని ఓ యువకుడు తెలిపాడు. బొమ్మలరామారంలో తనకు తెలిసిన వారే దాదాపు 20మంది దాకా రోజూ గంజాయిని పీల్చుతారని చెప్పాడు. బొమ్మలరామారం మండలంలోని మూడు, నాలుగు గ్రామాల్లోనే దాదాపు 200మంది వరకు గంజాయికి బానిసైన యువత ఉన్నట్లు అంచనా. ఆ మధ్య ఒక తోటలో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడింది గంజాయి వ్యవసపరులేనన్న ఆరోపణలు వచ్చాయి. హాజీపూర్ విద్యార్థినులపై జరిగిన అత్యాచారాల నేపథ్యంలో గంజాయి వినియోగంతో ఈ ప్రాంతంలో పెరుగుతున్న నేర సంస్కృతిపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్కు స్థానికులు బహిరంగంగా ఫిర్యాదు చేశారు. గంజాయి మత్తులో జోగుతున్న యువత పేకాట, బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు.
రవాణా ఇలా..ఇడ్లీ బండ్ల మాటున ఊర్లకు ప్యాకెట్లు..! వంద గ్రాములు 800 దాకా ధర...!!
బొమ్మలరామారం మండలంలోని గ్రామాలకు బైక్పై తిరుగుతూ టిఫిన్లను అమ్మే ఘట్కేసర్కు చెందిన ఓ చిరు వ్యాపారి ద్వారా గంజాయిని సరఫరా చేయిస్తున్నట్లు తెలిసింది. అతడికి ఘట్కేసర్, కీసర ప్రాంతాల నుంచి ఓ పాన్షాప్ యజమాని గంజాయి ప్యాకెట్లు అందజేస్తాడు. ఇడ్లీ, వడలతో పాటు గంజాయి పొట్లాలను గ్రామాలకు తీసుకెళ్లి... కస్టమర్లకు అందజేస్తున్నాడని చెబుతున్నారు. ఈసీఐఎల్, కాప్రా, జవహర్నగర్, మౌలాలిలో కూడా గంజాయి లభ్యమైతున్నట్లు తెలుస్తోంది. 100 గ్రాముల ప్యాకెట్ 800 రూపాయల దాకా అమ్ముతున్నట్లు తెలిసింది.
శామీర్పేట, ఘట్కేసర్, బొమ్మలరామారంలో విక్రయాలు..! గ్రామాల్లో టీనేజర్లకు వల..!!
బొమ్మలరామారం మండలంలోని అది ఓ చిన్న పల్లెటూరు.. అతడు నిరుడే టెన్త్ పూర్తి చేశాడు. తన క్లాస్మేట్ గంజాయి దమ్ము కొడుతుంటే.. సరదాపడి తానూ పీల్చాడు. అది మొదలు గంజాయి లేనిదే ఉండలేని పరిస్థితికొచ్చాడు. ఆరు నెలలుగా ఆ వ్యసనానికి బానిసయ్యాడు. సాయంత్రం అయితే ఆ అబ్బాయితో పాటు గంజాయి బ్యాచ్ ఒక దగ్గర చేరి దమ్ము కొడుతున్నారని గ్రామస్థులు చెప్పారు. బొమ్మలరామారంలో కొందరు యువత గంజాయికి బానిసయ్యారనే విషయం వాస్తవవేమనని సర్పంచ్ రాంపల్లి మహేశ్ అంగీకరించారు. తాను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గంజాయి రవాణాను అరికట్టడానికి ఎస్సై దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆరోపించారు. ఆ వ్యసనం బారినపడ్డ యువకుల ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకే విషయాన్ని చెప్పి అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.