రేవంత్ రెడ్డి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఇవీ...
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. ఆయన పార్టీ వీడుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం లాంఛనమే.
శుక్రవారం హైదరాబాదులో, శనివారం అమరావతిలో రేవంత్ రెడ్డి చంద్రబాబుతో జరిపిన భేటీ కాస్తా ఆసక్తి కలిగించింది. రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటారనే సందేహం మాత్రం ఎక్కడో ఉంటూ వచ్చింది. కానీ, ఆయన రాజీనామాకే సిద్ధపడ్డారు.
అనూహ్యమైన పరిణామాలు రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీని వీడేందుకు పురిగొల్పాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెరాసతో పొత్తు పెట్టుకుంటుందనే వార్త ఆయనను తీవ్రంగా కలచివేసిందని చెప్పవచ్చు.
అది జరుగుతుందని అనుకున్నారు....
తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ (టిడిఎల్పీ) నేతగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తానొక్కడై పార్టీకి జవజీవాలు పోయడానికి ప్రయత్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై సమరం ప్రకటించి, విస్తృత పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పటికీ ఆయన ఎక్కడా తగ్గలేదు. తన ప్రయత్నాలకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మద్దతు ఉంటుందని గట్టిగా నమ్మారు. తాజా పరిణామాలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాయి.
తెలంగాణకు కేటాయించాలని....
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కొంత సమయం కేటాయించాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును పదే పదే కోరుతూ వచ్చారు. నారా లోకేష్కు పూర్తిగా తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని కూడా కోరుతూ వచ్చారు. కానీ అవేవీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ బిజీ ఉంటూ వచ్చిన చంద్రబాబు తెలంగాణ పార్టీకి సమయం సరిగా కేటాయించలేకపోయారు. మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోవడంతో నారా లోకేష్ పూర్తిగా తెలంగాణ పార్టీకి దూరమయ్యారు. ఒక రకంగా చంద్రబాబు తెలంగాణలో టిడిపిని వదిలేశారు.
రేవంత్ రెడ్డి ఇలా....
తనకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి వ్యతిరేకంగా రాజకీయాలు నడపడాన్ని ఆయన ఆమోదిస్తారని రేవంత్ రెడ్డి నమ్ముతూ వచ్చారు. దాంతో తెరాసను ఎదుర్కోవడానికి కాంగ్రెసుతో కూడా స్నేహం చేయడానికి సిద్ధపడ్డారు. కెసిఆర్కు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలను, శక్తులను ఏకం చేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెసుతో పొత్తుకు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే, అకస్మాత్తుగా ఆయన ప్రయత్నాలకు తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి ప్రకటనతో గండి పడింది. అవసరమైతే తెరాసతోనో, బిజెపితోనో పొత్తు పెట్టుకుంటాం గానీ కాంగ్రెసుతో పెట్టుకోబోమని ఆయన చెప్పారు. అది రేవంత్ రెడ్డికి మింగుడు పడలేదు.
కెసిఆర్ అనంతపురం పర్యటన....
ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనంతపురం వెళ్లినప్పుడు సంభవించిన పరిణామాలు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం రుచించలేదు. ఎపి నాయకుడు పయ్యావుల కేశవ్తో కెసిఆర్ వెల్కం వ్యూహంపై చర్చించడంతో తెలంగాణ రాజకీయ పరిమాణాలు ఏ విధమైన మలుపు తిరుగుతున్నాయో రేవంత్ రెడ్డికే కాదు, ప్రజానీకానింతటికీ అర్థమైంది. తెలంగాణలో కమ్మ, వెలమ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి లేదా టిడిపి, తెరాస పొత్తుతో ఏకైమై జత కట్టబోతున్నట్లు స్పష్టమైంది. దాంతో కెసిఆర్పై తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాటం చేయలేననే నిర్ధారణకు రేవంత్ రెడ్డి వచ్చారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన....
తాను ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేనని నిర్దారించుకున్న తర్వాతనే రేవంత్ రెడ్డి కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెెసు నుంచే కాకుండా బిజెపి నుంచి కూడా ఆహ్వానం ఉందనే ప్రచారం చాలా కాలంగా సాగుతూ వస్తోంది. బిజెపి కూడా కెసిఆర్తో సన్నిహితంగానే ఉందని భావించిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తర్వాతనే ఎపి నేతలపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
సన్నిహిత మిత్రుడు సైతం....
కెసిఆర్తో ఆంధ్ర మంత్రులు అంటకాగుతున్నారంటూ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రుడైన పయ్యావుల కేశవ్పై కూడా విరుచుకుపడ్డారు. దాంతో తెలుగుదేశం పార్టీలో వేడి పుట్టింది. రేవంత్ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని అనిపించింది. అయితే, చంద్రబాబు విదేశాల్లో ఉండడంతో ఆయన వేచి చూసే ధోరణిని అవలంభించినట్లు అర్థమవుతోంది.
చంద్రబాబు విదేశాల్లో ఉండగానే....
చంద్రబాబు విదేశాల్లో ఉండగానే పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డిని టిటిడిఎల్పీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు కూడా ఆమోదంలేదని చెప్పారు. ఇదంతా చంద్రబాబు అనుమతితోనే తనకు వ్యతిరేకంగా జరుగుతుందనే నిర్ధారణకు రేవంత్ రెడ్డి వచ్చి ఉంటారు. అయితే, ఆయన ఎక్కడ కూడా తొణకలేదు. రమణ వంటి నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవించినట్లుగానే టిడిఎల్పీ నేతకు కేటాయించిన సీట్లో కూర్చోలేదు. తన వస్తువులను మాత్రం కార్యాలయం నుంచి తీసుకుని వెళ్లారు.
చంద్రబాబుతో భేటీ నామమాత్రమే....
చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ లాంఛనమేనని అర్థమవుతూ వచ్చింది. అయితే, చంద్రబాబును తాను ధిక్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఎక్కడా బయటపడలేదు. పార్టీలోని నాయకుల తీరు పట్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపించారు. కానీ, చంద్రబాబుతో ఏకాంత చర్చల్లో తన నిర్ణయాన్ని స్పష్టంగానే చెప్పినట్లు తెలుస్తోంది. కెసిఆర్కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో రాజీ పడేది లేదని ఆయన చంద్రబాబుతో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.