రాష్ట్రంలో తొలి మహిళా కమాండో బృందం .. ఇజ్రాయెల్ యుద్ధ తంత్ర కళలో శిక్షణ పూర్తి
ఆకాశంలో సగం అన్నింటా సగం అంటూ రక్షణ రంగం లోను మహిళలు తమ సత్తా చాటుతున్నారు.అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు సమానంగా ప్రతి రంగంలోనూ పోటీపడుతున్నారు. సరిరారు మాకు ఎవ్వరూ అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. గన్ను పట్టినా , గరిటె తిప్పినా మాకు మేమే పోటీ.. మాకు లేరెవ్వరు సాటి అంటూ మహిళా లోకం ముందుకు దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని తొలి మహిళా కమెండో బృందం ఇజ్రాయిల్ యుద్ధతంత్ర కళలో శిక్షణ పూర్తి చేసుకుంది.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 43 మంది పోలీసులతో తొలి మహిళా కమెండో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ 43 మంది మహిళా కమెండోలు యుద్ధ కళల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇటీవల వారు ఇజ్రాయిల్ యుద్ధ తంత్ర కళ క్రావ్ మగా లో కఠోర శిక్షణ పొందారు. శిక్షణానంతరం కరీంనగర్ రేంజ్ డి ఐ జి ప్రమోద్ కుమార్, కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సమక్షంలో పలు విన్యాసాలను ప్రదర్శించారు. ఆర్ ఎస్ ఎస్ మురళి ఆధ్వర్యంలో క్రావ్ మగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కమెండోలు మరిన్ని యుద్ధ కళలు నేర్చుకుంటూ పురుష కమెండోలతో పోటీ పడబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.