జల ప్రవాహాం వద్దకు జన ప్రవాహం..! ప్రాజెక్టుల్లో నీటిని చూసేందకు పోటెత్తుతున్న జనాలు..!!
శ్రీశైలం/హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. గత వారంలో కురిసి వర్షాల వల్ల, చుట్టు పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున నీరొచ్చి చేరుతోంది. ప్రాజెక్టుల సామర్ధ్యానికి మించి నీరు చేరుతుండడంతో నీటిని అదికారులు దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ సందర్బంగా సాగర్ లోకి పరిమితికి మించి వరద నీళ్లొచ్చి చేరాయి. ఇదే సమయంలో కృష్ణమ్మ పరవళ్లను కనులారా చూసేందుకు సందర్శకులు వెల్లువలా తరలివచ్చారు. శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతాలు సోమవారం కిటకిటలాడాయి. శ్రీశైలానికి లక్షలాది మంది పోటెత్తారు.
జనసంద్రమైన ప్రాజెక్టులు..! జల కళను చూసేందుకు పోటీ పడుతున్న జనాలు..!!
ఇక్కడ ట్రాఫిక్ స్థంభించడంతో అరగంటలో ముగిసే ప్రయాణానికి ఆరు గంటలు పట్టింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం నుంచే శ్రీశైలానికి జనం తరలివస్తున్నారు. మలన్న కొలువైన శ్రీగిరిపై సాధారణంగా ఈ నెలలో అంత రద్దీ ఉండదు. కానీ, డ్యామ్ గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లను చూద్దామని, మల్లన్నను దర్శించుకుందామని భక్తులు రావడంతో ఈ తాకిడి ఊహించనంతగా పెరిగిపోయింది. శ్రీగిరిపై సౌకర్యాలు లేక భక్తులు నానాపాట్లు పడ్డారు. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల సరిహద్దులోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆనకట్టపై రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాన్ని చూసేందుకు తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులతో ప్రాజెక్టు కిటకిటలాడింది.
వరద నీటితో పోటెత్తుతున్న ప్రాజెక్టులు..! నీటిని దిగువకు వదులుతున్న అదికారులు..!!
జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు 62 గేట్లు ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టుకు 7లక్షల 74వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, మత్తం 67 గేట్లకుగానూ 62 గేట్లు ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టు సముద్రాన్ని తలపించే విధంగా ఉంది. అయితే ఇక్కడ పవర్ జనరేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. పవర్ జనరేషన్ కేవలం ఒక లక్ష క్యూసెక్కులను తట్టుకునే విధంగా తయారుచేసేందుకు పవర్ జనరేషన్ను నిలిపివేశారు.
ఉరకలేస్తున్న కృష్ణమ్మ..! చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు..!!
అంతే కాకుండా ఇటు నాగార్జున సాగర్కు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. రిజర్వాయర్లో నీటిమట్టం గంటకు అడుగు చొప్పున పెరుగుతోంది. ఎనిమిది లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం 577 అడుగులకు, నీటి నిల్వ 224 టీఎంసీలకు చేరుకుంది. మరో ఒకటిన్నర రోజుల్లోనే సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 312 అడుగులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. డ్యామ్ భద్రత దృష్ట్యా గంటకో గేటు చొప్పున 26 క్రస్ట్గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ 26గేట్ల ఎత్తివేత..! కనువిందు చేస్తున్న సుందర దృశ్యాలు..!!
సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నాలుగు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేశారు. మధ్యాహ్నానికే ఎగువ నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కులకుపైగా వరద పెరగడంతో 26 గేట్లనూ ఎత్తి దిగువకు 2.63 లక్షల క్యూసెక్కుల నీటిని విడుద ల చేశారు. సరిగ్గా దశాబ్దం తర్వాత సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడం గమనార్హం.