ఫాంహౌస్ మీద ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు.!సీఎం కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ.!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుపై బీజేపి మరోసారి మండిపడింది. చంద్రశేఖర్ రావు విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తెలంగాణ ప్రజలంటే చాలా చులకన అన్నారు బీజేపి నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కు కనీసం చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ సీఎం చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు పాల్గొనలేదో, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

కేంద్రంపై బురద చల్లే ముఖ్యమంత్రి, దేశ ప్రధాన మంత్రి ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థతులపై ఎటువంటి భారం పడకుండా చూడాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు ఇచ్చిన విషయం గురించి కనీసం తెలుసుకోవలన్న ఆలోచన కూడా చంద్రశేఖర్ రావు కు లేదని డీకే అరుణ మండిపడ్డారు. దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం చాలా బిజీగా ఉన్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, చివరికి ఉపాద్యాయుల సమస్యలు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పట్టవని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు.