ఎన్నికల్లో ఓడినా పెద్దాయన మనసు గెలిచిన మాజీ మంత్రి..! త్వరలో క్యాబినెట్ లోకి...??
హైదరాబాద్ : ఖమ్మం బాద్ షా తుమ్మల నాగేశ్వర రావు వ్యవహారం టీఆర్ఎస్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఎన్నికల్లో ఓటమి చెందిన మంత్రి తుమ్మలకు మరో సారి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారా? ఆయన్ని ఎమ్మెల్సీ కోటా కింద మంత్రి పదవిలో తీసుకుంటారా? అంటే అవుననే సమాధానాలు వినిపిన్నాయి. ఎన్నికల్లో ఓడిన మంత్రులకు మళ్లీ బెర్త్ ఉండబోదని ఫలితాల తరువాత ప్రకటించిన సీఎం చంద్రశేఖర్ రావు తుమ్మల విషయంలో కాస్త మెతక వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మంత్రులు తమ్మల నాగేశ్వరావు. మహేందర్రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఆజ్మీర్ చందూలాల్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఐతే తుమ్మల పట్ల యువరాజు కేటీఆర్ కొంత సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే సీఎంకు స్నేహితుడైన తుమ్మల ఓటమి ఆ పార్టీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో బాధతో ఉన్న తమ్మల నాగేశ్వరావు రెండు రోజుల కిందట మినిస్టర్ క్వార్టర్స్లోని తన బంగళాను ఖాళీ చేయడానికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలిసిన సీఎం కార్యాలయం నుంచి తుమ్మలకు ఫోన్ వచ్చింది. 'తొందరపడకండి సర్.... పెద్దసార్ మాట్లాడతారంటా..' అంటూ వచ్చిన ఫోన్ కాల్తో ఆయన వెనక్కి తగ్గారు. ఈ విషయంపై పార్టీలో చర్చసాగుతోంది. ఖమ్మంలో పార్టీకి పెద్ద తలకాయలు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఇటీవల పార్టీ పగ్గాలు చేపట్టిన కేటీఆర్ జోక్యం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.