అద్యాపకులకు బెత్తం చూపిస్తున్న ప్రభుత్వం..! విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలే..!!
హైదరాబాద్ : విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అదికారుల పట్ల ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దం అయ్యింది. నిన్న ప్రభుత్వ డాక్టర్లకు దిశానిర్దేశం చేసి, విధులకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు బయో మెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు ఉన్నతాదికారులు. తాజాగా ప్రభుత్వ అద్యపకుల పైన ద్రుష్టి కేంద్రీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు సాంకేతిక విద్యా శాఖ ఝలక్ ఇచ్చింది. 'నిబంధనల ప్రకారం లెక్చరర్లు ఉండాల్సిందే.. వారు ప్రతి రోజు రావాల్సిందే.. లేదంటే జరిమానా తప్పదం'టూ బయోమెట్రిక్ హాజరులో మాయాజాలానికి చెక్ పెట్టింది. 2018-19 విద్యా సంవత్సరంలో లెక్చరర్ల హాజరులో నిబంధనలు పాటించని కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
ఫ్యాకల్టీ లేకపోతే జరిమానా..! ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలపై కొరడా..!!
బయోమెట్రిక్ హాజరు వేయని లెక్చరర్ల నుంచి వేతనాలు రికవరీ చేయాలని, ఆ మొత్తాన్ని ఎస్బీటెట్ అకౌంట్లో జమ చేయాలని ఆదేశించింది. 90కిపైగా కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. హయత్నగర్లోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలకు ఏకంగా 60 లక్షల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం గమనార్హం. 2018-19 విద్యా సంవత్సరంలో సెప్టెంబరు నుంచి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపకులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు.
ఫైన్ చెల్లిస్తే సరి.. లేదంటే గుర్తింపు ఇవ్వం..! సాంకేతిక విద్యా శాఖ నోటీసులు జారీ..!!
ఉదాహరణకు ఒక కాలేజీలో నిబంధనల ప్రకారం 10 మంది అధ్యాపకులు పని చేయాలి. కానీ బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఐదుగురు మాత్రమే పని చేసినట్లు తేలింది. మిగతా ఐదుగురు అసలు కాలేజీకే రాలేదా? లేక వచ్చినా బయోమెట్రిక్ హాజరు ఉపయోగించలేదా?అనే విషయంపై ఆరా తీశారు. కాలేజీకి రాని వారికి వేతనం ఎలా చెల్లిస్తారని అధికారులు ఆయా యాజమాన్యాలను ప్రశ్నించారు.
తప్పులు జరిగాయి..! సరిదిద్దుకునేందుకు సమయం ఇవ్వాలంటున్న యాజమాన్యాలు..!!
ఆ లెక్చరర్లకు ఇచ్చిన వేతనాలను రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని ఎస్బీ టెట్ అకౌంట్లో జమ చేయాలని, లేదంటే 2019-20 విద్యా సంవత్సరానికి అనుంబంధ గుర్తింపు ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఈ ఏడాదికి నిబంధనలను సడలించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.