హుటాహుటిన హస్తినకు గవర్నర్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆర్టీసీ కార్మికుల బంద్ నేపధ్యంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఆర్టీసీ కార్మిక జెఎసి నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని కలిసి ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు.తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఇక నేడు గవర్నర్ తమిళిసైకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా వెంటనే రమ్మని ఆమెకు పిలుపు రావడంతో గవర్నర్ హస్తినకు వెళ్లారు.
బతుకమ్మ గొప్పదనం అదే: ఆయుధ పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై
నేడు మోడీ, అమిత్ షాలతో తమిళి సై భేటీ
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా తెలంగాణ గవర్నర్ కు ఢిల్లీ నుంచి పిలుపురావడం అది కూడా వెంటనే రమ్మని చెప్పడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వెళ్ళిన గవర్నర్ తమిళి సై మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతోను, 4 గంటలకు హోం మంత్రి అమిత్ షాతోను తమిళిసై భేటీ కాబోతున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలోనే ఈ పిలుపు వచ్చినట్లు చెబుతున్నా కొన్ని రోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై క్షుణ్ణంగా నివేదిక తీసుకునేందుకే తమిళిసైని ఢిల్లీకి పిలిపించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కార్మిక సమస్యలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరిన జేఏసీ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 11 రోజులుగా కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మెకు దారి తీసిన పరిస్థితులకు కారణం ప్రభుత్వ విధానాలని అన్ని రాజకీయ పక్షాలు తప్పుపడుతున్నాయి. కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా,సమ్మెలో పాల్గొన్న కార్మికులపై వేటు వేసి చర్చల్లేవని ముఖ్యమంత్రి ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలువురు కార్మికులు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళారు ఆర్టీసీ కార్మిక జేఏసీ .
ఆర్టీసీ సమ్మెపై పూర్తి నివేదిక కోసమే తమిళిసై కి పిలుపు
కార్మిక సంఘాల గొంతెమ్మ కోర్కెలను ఆమోదించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మాంద్యం పాలు చేయలేనని ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని టిఆర్ఎస్ నాయకులు సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు బిజెపి అధినాయకత్వం గవర్నర్ ని ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు,ఆర్టీసీ సమ్మెపై పూర్తి నివేదిక తీసుకునేందుకు తమిళిసై ని పిలిచినట్టు తెలుస్తుంది.
ఈ వ్యవహారంలో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బి.జె.పి ముందుకు తీసుకెళ్లడానికి మోదీ, అమిత్ షా గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజా ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో గవర్నర్ ను నివేదిక కోరడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర సిద్దం అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ నివేదిక ఆధారంగా కేంద్రం ఎలాంటి చర్యలకు దిగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.