తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులు
రానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిందా అంటే అవును అనే అనే చెప్తున్నారు తెలంగాణా బీజేపీ నాయకులు . లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వెయ్యాలని భావిస్తుంది.
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..
కేంద్రంలో బీజేపీ తిరుగులేని పార్టీ .. తెలంగాణాపై కూడా ప్రత్యేక దృష్టి
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఇక దీంతో బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. పార్టీని బలోపేతం చేస్తే భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే ఆశలు చిగురించాయి. ఇక ఈ నేపధ్యంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారించనుంది అని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. అంతే కాక ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నారు. తద్వారా కూడా తెలంగాణా పట్ల బీజేపీ తన సానుకూల దృక్పధాన్ని చాటనున్నారు. ఇప్పటికే కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాలపైన దృష్టి పెట్టనుంది .
నాలుగు స్థానాల్లో అనూహ్య విజయంతో జోష్ లో ఉన్న కమల దళం
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో గెలవడం ద్వారా టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు తీర్పు ఇచ్చారన్న భావనలో ఉంది బీజేపీ . బీజేపీ కొన్ని స్థానాల్లో ఎంత గట్టిగ ఉందంటే.... సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కూతురునే ఓడించేంతలా బీజేపీ బలపడిందని తాజా ఎన్నికలు చెప్తున్నాయి. అయితే తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలు బీజేపీ విషయంలో చాలా అపోహ పడ్డారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఫిరాయింపు అవడం వల్లే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా భావించి ఓట్లు వేశారని భావిస్తున్నారు బీజేపీ నాయకులు . దీంతో ప్రత్యర్ధి పార్టీ పై మాటల దాడికి దిగుతున్నారు కాంగ్రెస్ పై నిప్పులు కురిపిస్తున్నారు.
భవిష్యత్ లో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ
కాగా తెలంగాణాలో కాంగ్రెస్ మరియు టీడీపీ ఓట్లు కూడా బీజేపీ రాబట్టుకుంటుంది . బెంగాల్ లో మమతా బెనర్జీ తరహాలోనే కేసీఆర్ సైతం కొత్త వ్యూహాలు రచిస్తున్నారని, బీజేపీ బెంగాల్ లో పోరాటం చేసి మెరుగైన ఫలితాలు ఎలా సాధించిందో, తెలంగాణాలో కూడా భవిష్యత్ లో అలాగే అవుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది.