ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే కేసీఆర్ ఆలోచన సరికాదు... ప్రజలే బుద్ధి చెప్తారు .. వీహెచ్ ధ్వజం
తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసింది. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోమారు విరుచుకుపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పలు రూపాల్లో తమ నిరసన తెలియజేస్తుంది. సుప్రీం కోర్టులో తేల్చుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేల్చి చెప్తుంది.
ఇక టీఆర్ఎస్ ఎల్పీ లో సీఎల్పీ విలీనంపై ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఉండకూడదనే కేసీఆర్ ఆలోచనా తీరు సరికాదని విమర్శించారు. తెలంగాణా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చెయ్యటం ఏ మాత్రం నైతికత అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికే ఇది వెన్నుపోటు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వైఖరి లేదని మండిపడ్డారు వీహెచ్ . ప్రతిపక్షానికి కావాల్సిన మెజార్టీ ఉన్నా, ప్రజలు అధికారం స్పష్టమైన మెజార్టీతో అప్పగించినా గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ లో కలుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన నేతలు, మరో పార్టీలో చేరడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వీహెచ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా , ఆందోళనలు నిర్వహిస్తున్నా , సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నా టీఆర్ ఎస్ పార్టీ మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలకు కంఠశోష మాత్రమే మిగులుతుంది. ఇక తాజాగా స్థానిక సంస్థలను సొంతం చేసుకునే పనిలో బిజీగా ఉన్న గులాబీ పార్టీ కాంగ్రెస్ నుండి గెలిచిన ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు సైతం గాలం వేస్తూ స్థానిక సంస్థలపై జెండా ఎగరేస్తుంది.