లంచావతారిణి లావణ్య ప్రభావం..! అవినీత చేయబోమంటూ ఉద్యోగుల ప్రతిజ్ఞ..!!
మహబూబ్నగర్/హైదరాబాద్ : తహసిల్దారు లావణ్య అవినీతి ప్రభావం తెలంగాణ ప్రజానికం మీద బాగానే పనిచేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పరువు తీసిన లంచావతారిణి లావణ్య ఉదంతాలు మళ్లీ వెలుగు చూడొద్దనే దిశగా తెలంగాణ మండల రెవెన్యూ ఉద్యోగులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అందుకోసం ప్రజల సమక్షంలో లంచాలు తీసుకోబోమంటూ ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద, వారి సంతానం మీది ఒట్టువేసి మరీ ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే అవినీతి వల్ల సమాజం ఎంత నాశనం అవుతుందో ననే సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంలాంటి పరిణామాలు జరిగితే అవినీతి అనేది కూకటి వేళ్లతో పెకిలించోచ్చనే చర్చ కూడా జరగుతోంది.
మహబూబ్నగర్ ఉద్యోగుల సామూహిక ప్రతిజ్ఞ...! వినూత్న సంప్రదాయానికి జిల్లా కలెక్టర్ శ్రీకారం..!!
మా పిల్లలు/తల్లిదండ్రులపై ఒట్టు.. లంచాలు తీసుకోబోం అంటూ మహబూబ్నగర్ జిల్లాలోని 15 మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, సర్పంచులు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా అడ్డుకట్ట వేసే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఈ వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా ఈ ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్, ప్రత్యేక అధికారి క్రాంతి, ఇతర ఉన్నతాధికారులు.. అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులతో, సర్పంచులతో వేర్వేరుగా ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, సర్పంచులతో ప్రమాణపత్రంపై సంతకాలు చేయించారు. అధికారులు చేసిన ప్రతిజ్ఞను అమలు చేస్తే సమస్యలన్నీ ఇట్టే పరిష్కారం అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల వినూత్న ప్రయత్నం..! అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ..!!
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 80 శాతం ఫిర్యాదులు భూ దస్త్రాల ప్రక్షాళనకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదాల పరిష్కారానికి.. అవినీతిపై సమరానికి జిల్లా కలెక్టర్ ఈ నెల 12న ‘మా భరోసా' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో ప్రత్యేక కాల్సెంటర్ ఏర్పాటు చేశారు. భూ సమస్యల పరిష్కారం, అవినీతిపై 08542-241165 నంబరుకు ఫోను చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కాల్సెంటర్కు గత మూడు రోజుల్లో 159 ఫిర్యాదులు వచ్చాయి.
లావణ్య ప్రభావం..! పరువు తీసిందంటున్న తోటి ఉద్యోగులు..!!
ఇదిలా ఉండగా ‘మా భరోసా' కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సర్పంచులు హాజరయ్యారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్, ప్రత్యేక అధికారి క్రాంతి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు మండలాల్లో పర్యటించి లంచాలు తీసుకోబోమంటూ ఉద్యోగులతో, సర్పంచులతో ప్రతిజ్ఞ చేయించారు. భూత్పూరులో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు దైవసాక్షిగా అంటూ ప్రమాణం చేయబోగా.. కలెక్టరు వారించారు.
ఎవ్వరూ లంచాలు తీసుకోకూడదు..! అందుకే ప్రతిజ్ఞ చేస్తున్నామంటున్న ఉద్యోగులు..!!
అధికారులు, సిబ్బందితో వారి పిల్లలపైన, తల్లిదండ్రులపైన ప్రమాణం చేయించారు. ‘దేవునిపై ప్రమాణం చేస్తే హుండీలో కొంత డబ్బు వేసి గోవిందా.. గోవిందా అంటూ చేసిన తప్పును కడుక్కునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి, పెళ్లి అయిన వారు పిల్లలపైన, ఇతరులు తల్లిదండ్రులపైన ప్రమాణం చేయాలి' అని సూచించారు. స్వయంగా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తన పిల్లలపై ప్రతిజ్ఞ చేయగా.. ప్రత్యేక అధికారి క్రాంతి ఆమె తల్లిదండ్రులపై ప్రమాణం చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వారిని అనుసరించారు. ఇదీ ప్రమాణ పత్రం నమూనా ఇలా ఉంది. ‘నేను అనగా......... తల్లిదండ్రులపై/నా పిల్లలపై నా మనసాక్షితో ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేయునది ఏమనగా.. నేను ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిడులకు లొంగకుండా, లంచాలు తీసుకోకుండా నా ఉద్యోగ బాధ్యతలు నిష్పక్షపాతంగా, సక్రమంగా నిర్వహిస్తాను'అని రాసుకుని మరీ ప్రమాణం చేయడం అందిరి చేత శభాష్ అనిపిస్తోంది.