నవ్వులు పూయించే చెరుకు ముత్యంరెడ్డి ఇక లేరు..! ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..!!
హైదరాబాద్: ఆయన ఎక్కడ ఉన్నా నవ్వులు పూయాల్సిందే.. ఆయన చుట్టు పక్కల వాతావరణం ఆహ్లాందంగా ఉండాల్సిందే.. ఉండకపోతే చుట్టు పక్కల పరిస్థితులను ఉత్సాహంగా మార్చేస్తారు. ఈ తరం వాళ్లెు కాకపోయినా నిన్నటి తరం జనరేషన్ కి బాగా కనెక్ట్ అయిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ గూటికి చేరారు. కాగా ముత్యంరెడ్డి మరణం పట్ల సీఎం చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం..! ముత్యం రెడ్డి అస్తమయం..!!
ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామం, తొగుట సర్పంచ్గా ముత్యంరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమై, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేసారు. సహకార సంఘం ఛైర్మన్గా రెండేంళ్ల పాటు సేవలందించారు. 1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..! ఆదేశాలు జారీ చేసిన సీఎం..!!
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యంరెడ్డి ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దురదృష్టం అని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్కే జోషిని ఆదేశించారు.
ముత్యం రెడ్డి మృతి పట్ల హరీష్ రావు దిగ్భ్రాంతి..! గొప్ప నేతలు కోల్పోయామన్న మాజీ మంత్రి..!!
కాగా ముత్యం రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమన్నారు. . వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. మంత్రిగా, ఎమ్మేల్యేగా ప్రజలకు వారు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ముత్యం రెడ్డి జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం..! ప్రముఖ నేతల నివాళి..!!
అంతే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక గొప్ప నాయకున్ని కోల్పోయామని, ఎమ్మెల్యే గా, మంత్రిగా , టిటిడి బోర్డు సభ్యులుగా, ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ముత్యంరెడ్డి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ లో చేరిన కొద్దిరోజుల్లో వారు అందించిన సేవలు మరువ లేనివని ఆయన గుర్తు చేసుకున్నారు. చివరి దశ వరకు కూడా ప్రజా సేవలో పరితపించారని, ఒక నిబద్ధత నాయకునిగా రాజకీయాల్లో రాణించారని అన్నారు. ఆయన అభివృద్ధిలో ఆదర్శ నాయకుడని, మాలాంటి ప్రజాప్రతినిధులకు స్ఫూర్తి అని హరీష్ రావు పేర్కొన్నారు.