హైదరాబాద్ మెట్రో రైలు: దాని వెనక ఉన్న కీలక వ్యక్తి ఎవరు?
హైదరాబాద్: ఎన్నాళ్లకు హైదరాబాద్ మెట్రో రైలు కూత పెడుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపడంతో అది పరుగులు పెట్టింది. బుధవారం ఉదయం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.
కార్లను పక్కన పెట్టి హైదరాబాద్ వాసులు బుధవారంనాడు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు పెద్ద చరిత్రే ఉంది. ఇది కార్యరూపం ధరించడానికి పనిచేసిన బృందంలో కీలకమైన వ్యక్తి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి.
ఇలా కాగితాల మీదికి...
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ లాంటి నగరానికి మెట్రో రైలు తప్ప మరో మార్గం లేదని నిపుణులు భావిస్తూ వచ్చారు. ఫలితంగా మెట్రో రైలు ప్రాజెకు 2007లో కాగితాలపైకి వచ్చి 2011 లో కార్యరూపం దాల్చింది. అప్పుడే ఉప్పల్ - నాగోలులో తొలి మెట్రో పిల్లర్ లేచింది. అయితే, అది పలు అవాంతరాలను, ఇబ్బందులను ఎదుర్కుంటూ వచ్చింది.
ఇలా వ్యతిరేకత...
వారసత్వ సంపద ధ్వంసమవుతుందని, పర్యావరణం దెబ్బ తింటుందని ఆరోపిస్తూ కొంత మంది దాని పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. వేల చరిత్ర గల చారిత్రక కట్టడాలు కనిపించకుండా పోతాయనే విమర్శ కూడా వెల్లువెత్తింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ నుంచి కూడా కొన్ని మార్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన కూతురు, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కోఠీలో ఆందోళనలకు కూడా శ్రీకారం చుట్టారు.
ఎన్వీఎస్ రెడ్డి ఇలా...
వాటన్నింటినీ మౌనంగానే గ్రహిస్తూ వచ్చారు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి. అంతకు ముందు రైల్వే శాఖలో పనిచేసిన విశేషమైన అనుభవం ఆయనకు ఉంది. హైదరాబాద్పై ఆయనకు మంచి అవగాహన ఉంది. దేశవిదేశాల్లోని రవాణా వ్యవస్థపై అధ్యయనం కూడా ఆయనకు సహకరించింది. భారతదేశ మెట్రో పితామహుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీధరన్ దగ్గర యన్.వి.ఎస్ రెడ్డి చాలాకాలం పనిచేశారు.
కేంద్రం ప్రశంసలు...
రైల్వేశాఖకు సవాల్గా మారిన కొంకన్ రైల్వే మార్గంలో ఎన్వీఎస్ రెడ్డి సేవలను కేంద్రం ప్రభుత్వం గతంలో కొనియాడింది. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలోనే కూలిన ఘటనలో కూడా ఆయన ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు చెబుతారు. జీహెచ్ఎంసీలో రవాణా వ్యవస్థ అడిషనల్ కమీషనర్ ఉన్నప్పుడు ఆయన బస్బేల ఏర్పాటు, రోడ్ల విస్తరణ, బాటిల్నెక్ల తొలగింపు వంటి విషయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు.
అన్నీ అడ్డంకులే...
మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం నుంచి పాలనా పరమైన , సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతూ వచ్చాయి. మరో వైపు పౌర సంఘాల వ్యతిరేకత కూడా ఎదురైంది. ఈ సవాళ్లను ఎదుర్కుంటూ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో పనులు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు.
నలుగురు సిఎంలు మారారు...
మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు, 12 మంది ప్రభుత్వ మారారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా వచ్చారు. ప్రాజెక్టు పనులు కుంటుపడకుండా వారితో ఎప్పటికప్పుడు వర్యవేక్షణ చేస్తూ ఎన్వీఎస్ రెడ్డి ముందుకు సాగారు.