ఆ జిల్లాలో మైనారిటీలదే హవా..!! వారు ఎవరిని బలపరిస్తే వారిదే విజయం..!!
హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలో పోరుగడ్డ కరీంనగర్ స్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా వెలమలే ఉండాలన్న అప్రకటిత నిబంధన దశాబ్దాలుగా కొనసాగింది. కరీంనగర్ లోక్ సభ స్థానంలో 1957 నుంచి 1996 వరకు ఇదే ఆనవాయితీ కొనసాగింది. ప్రస్తుత టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ సాంప్రదాయానికి బ్రేకులు వేశారు. మళ్లీ 1998 నుంచి 2009 వరకు సీహెచ్. విద్యాసాగర్ రావు, కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించారు. 2009లో బీసీ అయిన పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహించినా మళ్లీ 2014లో వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్ కుమార్ గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీ అయినా తమ అభ్యర్థిని వెలమ సామాజిక వర్గం నుంచే ఎంపిక చేసేలా ఆ సామాజిక వర్గం లాబీయింగ్ చేస్తుందని పేరుంది. అయితే ఇప్పుడు ఆ పరంపరకు మైనారిటీలు చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
కరీంనగర్ లో మారనున్న ట్రెండ్..! మైనారిటీలు ఎవరికి సై అంటే వారే విజేతలు..!!
అసెంబ్లీ స్థానం విషయంలోనూ దాదాపుగా వెలమలకే ప్రధాన పార్టీలు టికెట్ కేటాయిస్తూ వచ్చేవి. గంగుల కమలాకర్ దీనిని బ్రేక్ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. టికెట్ రావడం లాంఛనప్రాయమేనని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి జే. చొక్కారావు శిష్యుడిగా పేరు తెచ్చుకుని గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ మాట్లాడి అన్ని సమస్యలపై అవగాహన కలిగిన నేతగా ఇమేజ్ తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ కి అనుకూలం..!! టీఆర్ఎస్ కి ఇబ్బందికర పరిస్థితులు..!!
ఆర్థిక బలం లేకున్నా అంచలంచెలుగా ఎదిగిన నాయకుడు కావడం, బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా ఎదగడంతో ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. ఇదే సందర్భంలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తుండడంతో ఈ పదవి తనకు ప్లస్ పాయింట్ అవుతుందని పొన్నం భావిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎటు పడితే వారే గెలుస్తారని పేరుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించడంతో ఆ పార్టీ గెలిచింది. కానీ అసెంబ్లీ విషయంలో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది.
త్రిముఖ పోటీ తప్పదు..! కీలకం కానున్న మైనారిటీ ఓట్లు..!!
ఈసారి టీఆర్ఎస్ నుంచి తిరిగి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి పొన్నం పోటీ చేయనున్నారు. కరీంనగర్ లో ఈసారి మైనారిటీ ఓట్లు టీఆర్ఎస్ కు పడే పరిస్థితి లేదు. మోడీ కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందన్న ప్రచారంతో కరీంనగర్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ అభ్యర్థి గానీ, బీజేపీకి రహస్య స్నేహితుడిగా ఉన్న టీఆర్ఎస్ గానీ గెలవొద్దన్నది ఇక్కడి మైనారిటీల వ్యూహంగా తెలుస్తోంది. ఇక్కడ బండి సంజయ్ కు కూడా గట్టి పట్టుంది. ఆధ్యాత్మిక ప్రభావం ఎక్కువగా ఉండే కరీంనగర్ లో బండి సంజయ్ పలు ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండి వారిని ఆకట్టుకున్నారు. సంజయ్ బలం పెరిగిన కొద్దీ మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది.
హామీలు హామీలుగానే మిగిల్చిన టీఆర్ఎస్..! ఎదురీత తప్పదు..!!
ఇక ప్రతిపక్ష పార్టీ నేతగా పొన్నం బలమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజానేతగా గుర్తింపు పొందారు. ఇసుక కుంభకోణాలు వెలికితీయడం, మెడికల్ కళాశాలను టీఆర్ఎస్ నేతలు రానివ్వకపోవడంపై ఆందోళనలు చేయడం వంటి కార్యక్రమాలతో జనంలో నిలిచారు. పైగా ఆయన ఎంపీగా ఉన్న కాలంలో చేసిన పనులపై ప్రజల్లో సానుకూలత ఉంది. ఇక గంగులకు ప్రస్తుతం కష్టకాలమనే చెప్పాలి. అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పేరుతో ఏళ్లుగా రోడ్లను తవ్వి ఇబ్బందులు కలగజేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించలేదని నగర వాసులు వాపోతున్నారు. కరీంనగర్ ను డల్లాస్ నగరంగా మార్చడం, రివర్ ఫ్రంట్ నిర్మిస్తామనడం, స్మార్ట్ సిటీ నిర్మాణం తదితర హామీలన్నీ అలాగే ఉండడం తో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.