మునుగోడు బై పోల్ ముహూర్తం ఫిక్స్ - కొత్త వ్యూహాలతో రంజుగా..!!
తెలంగాణలో ఉత్కంఠ పెంచుతున్న మునుగోడు బై పోల్ కు రంగం సిద్దం అవుతోంది. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ రానుందని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరో వారంలోగానే షెడ్యూల్ రానున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మునుగోడు బై పోల్ షెడ్యూల్ నవంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉందంటూ బీజేపీ ముఖ్య నేత సునీల్ బన్సాల్ పార్టీ నేతలను అప్రమత్తం చేసారు.
మరో వారంలో బై పోల్ షెడ్యూల్
తక్షణ ప్రచార కార్యక్రమాలు కొనసాగించాలని ముఖ్య నేతలకు సూచించారు. ప్రతీ ఓటరును కనీసం మూడుసార్లు కలిసేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, కులాలపై స్థానిక నేతల నుంచి వివరాలు తీసుకున్నారు. అక్టోబరు 8లోపు మండలాల వారీగా సభలు, ఆర్థిక వ్యయానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల నల్లగొండ జిల్లా నేతలకు సూచించారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని పార్టీ నేతలతో చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో వరుసగా ఎదురైన ఫలితాలతో టీఆర్ఎస్ అధినాయకత్వం మునుగోడు విషయంలో ముందస్తు చర్యలు చేపట్టింది.
మూడు ప్రధాన పార్టీల వ్యూహాలు
నిధుల విడుదల - నేతల చేరికలు..పథకాల ప్రకటనలు వంటివి లేకుండా కొత్త పంథాతో ఉప ఎన్నికలో గెలిచే వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ ఇంటికి వెళ్లి.. ప్రతీ ఓటరును కలిసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి.
సీపీఐ, సీపీఎం నేతలతో గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి 7 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. మరో వైపు కాంగ్రెస్ నాయకత్వం కూడా మునుగోడును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర మరి కొద్ది రోజుల్లో తెలంగాణకు చేరుకోనుంది. ఈ యాత్ర సమయంలోనే శంషాబాద్లో బహిరంగ సభ పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. రాహుల్ సభకు మునుగోడు ఓటర్లను తరలించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.
ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఉప ఎన్నిక
ఉప ఎన్నికకు సంబంధించి రాహుల్ పెద్దగా మాట్లాడే అవకాశం ఉండబోదని తెలిసింది. ఎక్కువ సమయం ఉపఎన్నిక గురించి ప్రసంగిస్తే.. అక్కడ ఫలితం తారుమారైతే రాహల్కు, పార్టీ ప్రతిష్ఠకు రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తాజాగా మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసారు.
నియోజకవర్గంలో తాజా పరిస్థితులను వివరించారు. అమిత్ షా తాను సేకరించిన క్షేత్ర స్థాయి సమాచారంతో రాజగోపాల్ రెడ్డిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేత సునీల్ బన్సాల్ ఇప్పుడు మనుగోడు వ్యూహాలను పార్టీ కోసం అమలు చేస్తున్నారు. ఉప ఎన్నిక వేళ..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతో..మరో వారం పది రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలతో తెలంగాణ రాజకీయం మరింత రంజుగా మారుతోంది.