నయీం కేసులో బయటకు వచ్చిన బడా నేతల పేర్లు..! అనూహ్యంగా తెరమరుగు..!కారణం అదేనా..?
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం అక్రమ వ్యాపార లావా దేవీలతో సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో కొన్న రాజకీయ నేతల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ఆ పేర్లన్నీ ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్ల క్రితం ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం తాలూకూ తప్పిదాలు.. సెటిల్మెంట్లు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లాను అడ్డా చేసుకుని నయీం చేసిన పాపాల చిట్టాలో చాలామంది పాత్రదారులు ఉన్నారనేది బహిరంగ రహస్యం. పోలీసు అధికారులు పెంచి పోషించిన కాలనాగు తమకు గొడుగు అనుకున్నారు కానీ భవిష్యత్ లో దాని విషయపు ఛాయలు తమనూ తాకుతాయని గుర్తించలేకపోయారు.
ఫలితంగా పోలీసుల కు అందిన ముడుపులూ వెలుగులోకి వచ్చాయి. నక్సల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు నయీంను పావుగా వాడుకున్న పోలీసులు.. తమకు చేసిన మేలుకు తగిన ప్రతిఫలంగా నయీం రౌడీయిజాన్ని సమర్ధించారు. చివరకు తెరాస నేతలను హెచ్చరించేంత వరకూ చేరటంతో పాలకుల ఆదేశాలతో ఎన్ కౌంటర్ చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
అది గతం.. మరి ఇప్పుడు.. నయీం చేసిన తప్పులు.. కూడబెట్టిన కోట్లాదిరూపాయలు.. వేలాది ఎకరాల ఖరీదైన భూముల్లో భాగం ఉన్న వారిలో బీసీ నేత ఆర్.కిష్టయ్య పేరు తెరమీదకు వచ్చింది. అదే సమయంలో గులాబీ పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. జడ్పీ ఛైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ ల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. కానీ గులాబీ సీఎం మాత్రం ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కుట్రగానే కొట్టిపారేస్తున్నారు.
మరి దీన్ని ఇక్కడే వదిలేస్తారు.. అసలు దోషులు ఎవరనేది తేలేంత వరకూ పోలీసుతో దర్యాప్తు చేయిస్తారా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఏది ఏమైనా నయీం బతికుండి చికాకులు పెట్టాడు.. మరణించిన మూడేళ్ల తరువాత కూడా చుక్కలు చూపుతున్నాడంటూ గులాబీ శ్రేణులు తెగ బాధపడిపోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఐతే కొంత మంది పోలీసు ఉన్నతాదికారుల పేర్లు కూడా ఉండడం, రాష్ట్రం విడిపోడంతో కొంత మంది పక్క రాష్ట్రానికి వెళ్లి పోవడం వంటి అంశాలతో కేసు విచారణ కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.