వాస్తు పేరుతో కెసిఆర్ కూల్చివేతలు: వాటి విలువ రూ. 200 కోట్లు
హైదరాబాద్: వాస్తు సరిగా లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూల్చ తలపెట్టిన సచివాలయ భవనాల విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాత సచివాలయ భవనాలను కూల్చివేసి, కొత్త భవనాలను నిర్మించాలనే కెసిఆర్ నిర్ణయంపై వేడి వేడి చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అది కోర్టు దాకా వెళ్లింది కూడా.
సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తెలంగాణ సచివాలయం పాత భవనాల వెల ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అనే చర్చ కూడా సాగుతోంది. వీటి ధర 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. పాత భవనాలతో పాటు మంత్రులు, అధికారుల ఛాంబర్లకు చేసిన డెకొరేషన్, కార్డుబోర్డుతో చేసిన సిబ్బంది ఛాంబర్లకు కూడా ఖరీదు కట్టాల్సే ఉంటుందని చెబుతున్నారు.
మిగతా బ్లాకులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాడకానికి కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాటిని తెలంగాణకు అప్పగించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు తాత్కాలిక రాజధాని వెలగపూడికి మారిన నేపథ్యంలో కెసిఆర్ పాత భవనాల కూల్చివేతకు నడుం బిగించారు.
సచివాలయంలో సి- బ్లాక్ కథ ఇదీ..
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోని నాలుగు భవనాలను (ఎ,బి,సి.డి బ్లాకులు) ఉపయోగించుకుంటోంది. సి-బ్లాకును ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి పేషీ, సాధారణపరిపాలనా శాఖ (జిఎడి) అవసరాలకోసం వాడుతున్నారు. C BLOCK.jpg
ఈ బ్లాకును చంద్రబాబు నిర్మించారు...
సచివాలంయలోని ‘డి' బ్లాకును 2000సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించారు. అప్పట్లో దీనికి 40 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ‘డి' బ్లాకులో ప్రస్తుతం తెలంగాణ మంత్రులకు, వివిధ శాఖల అధికారులకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. D BLOCK.jpg
ఈ రెండు బ్లాకుల్లో ఇవీ..
ఎ,బి బ్లాకులను హోంశాఖతో సహా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కోసం వాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సచివాలయ భవనాలను (ఎ,బి,సి,డి బ్లాకులు) మొత్తాన్ని ఖాళీ చేసి కూల్చివేయాల్సి ఉంటుంది.
వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...
కొత్తగా ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పది అంతస్థులతో ఇప్పుడున్న డి-బ్లాకు స్థలంలో కొత్తగా అధునాతన భవనం నిర్మించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు అన్నీ సజావుగా సాగితే కొత్త భవనాన్ని ఏడాదిలోగా నిర్మించాలని, అంతవరకు మంత్రులు, ఉన్నతాధికారుల ఛాంబర్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
అవి ఎపి ప్రభుత్వ వాడకంలో...
తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న ఐదు భవనాలు (జె, హెచ్-నార్త్, హెచ్-సౌత్, కె, ఎల్ బ్లాకులు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటోంది. ఎపి ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన ఇతర కార్యదర్శులు వారి సిబ్బంది కోసం ఎపి ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఎపి ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, వివిధ శాఖలన్నీ విజయవాడ, గుంటూరు, అమరావతి తరలిపోవడంతో ఈ భవనాలు ఖాళీ అయ్యాయి.
అవి ఇంకా ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదున్నర లక్షల చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ భవనాలు ఎపి ప్రభుత్వ అధీనంలోనే నేటికీ ఉన్నాయి. వీటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ భవనాలు తెలంగాణకు అప్పగిస్తే తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
ఎపి అప్పగించుకున్నా కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే, ఈ భవనాల్లోకి తాత్కాలికంగా తెలంగాణ సచివాలయాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఒక వేళ ఈ భవనాలు ఎపి ప్రభుత్వం తమ అధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయిస్తే బూర్గుల రామకృష్ణారావు భవన్ (బిఆర్కె భవన్)తో పాటు మరో ఐదు భవనాల్లోకి సచివాలయ కార్యాలయాలను, మంత్రుల ఛాంబర్లను మార్చాలని ఆలోచిస్తున్నారు.