స్కూల్ లోకి దెయ్యాలు వస్తున్నాయని క్షుద్ర పూజలు చేయించిన ప్రిన్సిపాల్.. షాక్ అయిన జనం
వరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏకంగా స్కూల్లోనే దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకాలు పెట్టుకున్న ప్రదానోపాధ్యాయురాలు చేసిన పనితో స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడైనా చదువు లేని వారు దెయ్యాలు, భూతాలూ అని మూఢ నమ్మకాలను విశ్వసించారు అంటే ఓకే కానీ చదువుకుని పది మందికి విద్యాబోధన చేసే వృత్తిలో ఉన్న వాళ్ళే మూఢ నమ్మకాలకు లోనవుతుంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే
ఎక్కడైనా చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి. విద్యార్థులకు స్కూల్స్ లో టీచర్లు కూడా మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ప్రయత్నం చెయ్యాలి . అయితే, బడులే మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తుంటే విద్యార్థులు పరిస్థితి ఏంటి అన్న భావన కలగక మానదు . ఇక అసలు విషయానికి వస్తే వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో దెయ్యాలున్నాయని భయపడిన ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా భూత వైద్యుడిని పిలిపించి క్షుద్ర పూజలు చేయించింది.
ఇక ఈ విషయం ఈ నోటా ఆ నోటా అందరికీ తెలియటంతో ప్రధానోపాధ్యాయురాలు చేసిన పనికి గ్రామస్తులు నివ్వెరపోయారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లే , శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన నేటి రోజుల్లోనూ ఇలా దెయ్యాలు, భూతాలూ అని భయపడుతూ భూత వైద్యులను ఆశ్రయిస్తే ఇక విద్యార్థులు ఏ మార్గంలో వెళతారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ప్రధానోపాధ్యాయురాలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.