రాహుల్ గాంధీ, చంద్రబాబు రాక: బెంగళూరు వెళ్లి కేసీఆర్ వెంటనే రావడం వెనుక కారణాలు ఇవీ!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం బెంగళూరుకు వెళ్లి కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామికి శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలను తన ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి ఆహ్వానించారు. అయితే, కేసీఆర్ మాత్రం ముందే వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు.
ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకపోవడమే అంటున్నారు. కేసీఆర్ గత కొన్నాళ్లుగా బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా, రాహుల్ గాంధీలతో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకపోవడమే అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు తెలంగాణ రాజకీయ పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నవి.
ఆ రాష్ట్రాల్లో అలా, తెలంగాణలో ఇలా
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ (బీఎస్పీ), అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), తేజ్ ప్రతాప్ (ఆర్జేడి), మమతా బెనర్జీ (టీఎంసీ), స్టాలిన్ (డీఎంకే) తదితరులను ఆహ్వానించారు. వీరంతా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ఉన్నారు. లేదా పొత్తుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో వారికి కాంగ్రెసేతర పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. తెలంగాణలో కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సే. ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ దూరంగా ఉండటానికి ఇది కూడా ప్రధాన కారణం.
ఎమర్జెన్సీ మీటింగ్
కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో రాహుల్, చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ దోస్తీలతో వేదిక పంచుకోవడం ఇష్టం లేని కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవో గురువారం ఓ ప్రెస్ నోటి విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు కేసీఆర్ కలెక్టర్లు, మంత్రులతో ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు స్కీం పైన చర్చించనున్నారు. వేదిక పంచుకోవడం ఇష్టం లేకే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు.
ఆ విషయం తెలిసి
కేసీఆర్ వ్యూహాత్మకంగా మంగళవారం బెంగళూరు పర్యటనకు వెళ్లి వచ్చారు. తొలుత బుధవారం ఆయన బెంగళూరు వెళ్లాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారని సమాచారం అందటంతో వారితో వేదిక పంచుకుంటే తప్పుడు సంకేతాలు అందుతాయని కేసీఆర్ వెంటనే వెళ్లి వచ్చారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో వెళ్లి రాత్రి పది గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
కుమారస్వామి, కేసీఆర్ ఏకాంత చర్చలు
ప్రాంతీయ పార్టీలుగానే కాకుండా రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయని, పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధించేందుకు కృషి చేద్దామనికేసీఆర్.. కుమారస్వామితో చెప్పారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం తర్వాత మళ్లీ తాను వస్తానని, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చిద్దామన్నారు. ఆయనను హైదరాబాద్కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. వీరిద్దరూ కొంతసేపు ఏకాంతంగా చర్చించారని సమాచారం. ఆ తర్వాత దేవేగౌడ, రేవణ్ణలతో కలిసి మీడియాతో మాట్లాడారు.