సేల్స్బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్..
మోటివేటర్, రిక్రూటర్, లాజిస్టిక్ ప్రొవైడర్, బాంబు మేకర్, లీడర్.. ఇదీ యాసిన్ భత్కల్ గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పేది. యాసిన్ భత్కల్ భయంకరమైన టెర్రరిస్టులలో ఒకడు.
హైదరాబాద్: మోటివేటర్, రిక్రూటర్, లాజిస్టిక్ ప్రొవైడర్, బాంబు మేకర్, లీడర్.. ఇదీ యాసిన్ భత్కల్ గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పేది. యాసిన్ భత్కల్ భయంకరమైన టెర్రరిస్టులలో ఒకడు. అలాంటి భత్కల్ పైన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం నేరం రుజువైంది.
ప్రత్యేక జాతీయ దర్యాఫ్తు సంస్థ న్యాయస్థానం యాసిన్ భత్కల్తో పాటు మరో నలుగురిని నేరస్తులుగా తేల్చింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. నేరం రుజువైన వారిలో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్దిబాషా అలియాస్ యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ అజీజ్ సయీద్ షేక్లను దోషులుగా తేల్చింది.
నేరం రుజువు కావడంతో యాసిన్ భత్కల్ ఇక జైలు జీవితం గడుపుతాడా లేక ఉరి తీస్తారా అనే విషయమై డిసెంబర్ 19న కోర్టు తేల్చనుంది. అయితే, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)లో యాసిన్ భత్కల్ కీలక స్థాయికి అనూహ్యంగా ఎదిగాడు.
సేల్స్ బాయ్ నుంచి...
యాసిన్ భత్కల్ సేల్స్ బాయ్ నుంచి ఇండియన్ ముజాహిదీన్ నాయకుడిగా ఎదిగాడు. ఇతని తండ్రి బట్టల వ్యాపారి. తండ్రికి ఈ వ్యాపారంలో సహకరించేవాడు. ఆ తర్వాత అతను బాంబు తయారు చేసే స్థాయికి, ఐఎం నేతగా ఎదిగాడు.
పుట్టింది కర్నాటకలోని..
కర్నాటకలోని కోస్టల్ నగరం భత్కల్లో 15 జనవరి 1983లో యాసిన్ భత్కల్ జన్మించాడు. ఇండియన్ ముజాహిదీన్ స్థాపకులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లకు ఇతను దగ్గరి బంధువు. యాసిన్ భత్కల్ అసలు పేరు అహ్మద్ జరార్ సిద్దిబాబా. ఇతను వివిధ పేర్లతో పరిచయాలు పెంచుకునేవాడు. అందులో షారుక్ ఖాన్, శివానంద్, డాక్టర్ ఇమ్రాన్ తదితరాలు ఉన్నాయి.
సొంతూళ్లో ఎక్కువ రోజులు ఉండలేదు
యాసిన్ భత్కల్ తన సొంత ఊళ్లో ఎక్కువ రోజులు ఉండలేదు. బట్టల వ్యాపారంలో తన తండ్రికి సహకరించేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడే రియాజ్ ద్వారా రాడికల్ మార్గం వైపు అడుగు పెట్టాడు. యాసిన్ వైఖరిలో మార్పు తండ్రి కూడా గుర్తించాడు. ఆ తర్వాత దుబాయ్ వదిలాడు.
భారత్ వచ్చాక..
దుబాయ్ నుంచి భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కోసం పని చేయడం ప్రారంభించాడు. ఐఎం కోసం నిధుల సేకరణ బాధ్యత తీసుకున్నాడు. నిధుల సేకరణ కోసం ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. పేరుకే నిర్మాణ సంస్థ. దీని ద్వారా ఐఎంకు ఫండ్స్ సేకరించడమే ఉద్దేశ్యం. అతను ఓసారి కొద్ది సమయంలోనే ఐఎంకు రూ.14 లక్షల ఫండ్ సేకరించాడని తెలుస్తోంది. అతను ఫేక్ కరెన్సీ రాకెట్ ద్వారా కూడా నిధులు సేకరించాడు.
బాంబుల తయారీ
యాసిన్ భత్కల్ ఆ తర్వాత బాంబులు తయారీ చేయడం నేర్చుకున్నాడు. అతను అతి తక్కువ సమయంలో నేర్చుకున్నాడు. విచారణలో షాకింగ్ విషయం తేలినట్లుగా తెలుస్తోంది. అతను ప్లాన్ చేసిన ప్రతి బాంబు బ్లాస్టుకు సొంతగా బాంబులు తయారు చేసేవాడని తెలుస్తోంది.
ఇండియన్ ముజాహిదీన్
టెర్రరిస్టుల పైన నిఘా విభాగం ఎప్పుడు దృష్టి సారిస్తుంది. అయితే, యాసిన్ భత్కల్ ఎప్పుడు కూడా ఏజెన్సీల దృష్టిలో పడలేదు. ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ ముఖ్య నేతలు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు కనిపించకుండా పోయారు. రియాజ్, ఇక్బాల్, అబ్దుస్ సుహాన్ వంటి వారు భారత దేశాన్ని వదిలి పారిపోయారు. వారు పాకిస్తాన్లో షెల్టర్ తీసుకున్నారు.
పునరుజ్జీవం
ఆ సమయంలో ఇండియన్ ముజాహిదీన్ దాదాపు కనుమరుగయిందని అందరూ భావించారు. అయితే అప్పటి దాకా ఏజెన్సీల దృష్టిలో పడని యాసిన్ భత్కల్.. తన సహచరులు వకాస్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ తదితరులతో కలిసి పునరుజ్జీవం పోశాడు. ఈ ఐఎం నేతలు ఒకరితో మరొకరు ఫోన్లో మాట్లాడుకునే వారు కాదు. తాము ఫోన్లో మాట్లాడితే ట్రాప్ చేస్తారని భావించి దానిని దూరంగా పెట్టేవారు. ప్రతి సమాచారం ముఖాముఖి ఉండేది. దాడులకు బాధ్యత వహించడం వంటి వాటికి దూరంగా ఉండేవాడు.
2006లో ముంబైలో 13/7 ట్రెయిన్ బ్లాస్టులో యాసిన్ భత్కల్ ముఖ్య పాత్ర పోషించాడు. 2010లో ఢిల్లీ బ్లాస్ట్, 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పేలుడు, 2010లో పుణేలో జర్మన్ బేకరీ పేలుడు, 2011లో ఢిల్లీ హైకోర్టు పేలుడు, 2011లో ముంబై వరుస పేలుళఅలు, 2013లో దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో ఇతని పాత్ర ఉంది.
రియాజ్తో విభేదాలు
కొద్ది రోజుల తర్వాత యాసిన్ భత్కల్కు తన మెంటర్ రియాజ్ భత్కల్తో విభేదాలు వచ్చాయి. రియాజ్ కరాచీలో మంచి జీవితం అనుభవిస్తుంటే తాను మాత్రం ఇక్కడ వీధుల్లో ఇలాంటి పనులు చేస్తున్నానని భావించాడు. అలాగే, ఐఎస్ఐకి రిపోర్ట్ చేయాలనే దానితో యాసిన్ విభేదించేవాడు. ఐఎస్ఐకి ఓ సిద్ధాంతం లేదని యాసిన్ భత్కల్ భావించేవాడు. ఇది కూడా రియాజ్ - యాసిన్ మధ్య విభేదాలకు కారణమైందని తెలుస్తోంది.
పాక్కు రియాజ్ పిలుపు
ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్లో విభేదాలు ఎక్కువ అవుతుండటంతో యాసిన్ భత్కల్తో ప్యాచప్ కోసం రియాజ్ భత్కల్ యోచించాడు. తనను కలిసేందుకు పాకిస్తాన్ రావాలని చెప్పాడు. విభేదాలు తొలగించుకుందామన్నాడు. అతను నేపాల్ మీదుగా పాకిస్తాన్ వెళ్తుండగా ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతనిని అరెస్టు చేశారు.
భార్యకు కాల్ చేసి అరెస్టయ్యాడు
అంతకుముందు ఆపరేషన్స్ సమయంలో ట్రాప్ చేస్తారని ఎప్పుడూ ఫోన్ కాల్ చేయలేదు. కానీ అతను పాకిస్తాన్లోకి అడుగు పెట్టే ముందు తన భార్యకు ఫోన్ కాల్ చేశాడు. గుర్తించిన ఇంటెలిజెన్స్ అతనిని అదుపులోకి తీసుకుంది. మరో ఆసక్తికర, ధ్రువీకరించని ఓ అంశం కూడా ప్రచారంలో ఉంది. ఇండియన్ ముజాహిదీన్లోనే కొందరు అతని కదలికలను లీక్ చేసి ఉంటారని అంటారు.