11 వ రోజుకు చేరుకున్న సమ్మె..! ఎవరి మొండి పట్టు వారిదే..! నలిగిపోతున్న సామాన్యులు..!!
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసి సమ్మె రోజురోజుకూ ఉదృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవార్చాలని కోరుతూ ఆర్టీసి కార్మికులు గత 11రోజులగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల స్వీయ ఉద్వాసనకు గురయ్యారని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించిన మరుక్షణం నుండి పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. అంతే కాకుండా ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగాలకు ఆఘమేఘాల మీద ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక తమ ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోయామన్న అభద్రతా భావంలో కొంత మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా చేయి దాటిపోతున్నా ప్రభుత్వం తన మొండి వైఖరి మాత్రం విడనాడటం లేదనే చర్చ జరుగుతోంది.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఆర్టీసి సమ్మె ఉదృతం.. ప్రభుత్వం మెట్టు దిగాలంటున్న రాజకీయ పార్టీలు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకున్నది. ఇప్పటికే ఒక డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్య చేసుకోగా మరికొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. రోజు రోజుకి ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతు పెరుగుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మొదట మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సీపీఐ పార్టీ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. సమ్మె మరింత తీవ్రతరం కాకముందే పరిష్కారం కనుగొనాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ప్రమాదాలకు కారణమవుతున్న తాత్కాలిక డ్రైవర్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లను తీసుకున్న ప్రభుత్వం అందుకు తగిన మూల్యం చెల్లింస్తోంది. చాలా కాలం డ్రైవింగ్ కు దూరంగా ఉన్న డ్రైవర్లు ఒకే సారి బస్సులను నడపడంలో తగబడుతున్నట్టు తెలుస్తోంది. దాని ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతున్నారు. మొన్న మహబూబ్ నగర్, కరీంనగర్ , నేడు సూర్యాపేట జిల్లాలో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఇదే అంశం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ సమ్మె కేసు విచారణ కు రానుంది.
ఆత్మహత్యలు సరికాదు... ఉద్యోగులు సంయమనం పాటించాలన్న చంద్రబాబు..
తెలంగాణ లో ఆర్టీసి సమ్మె, ఉద్యోగుల ఆత్మహత్యల గురించి టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం నా మనసును కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. జీవితం ఎంతో విలువైందని, దేన్నైనా బతికి సాధించాలి తప్ప బలవన్మరణం అనేది పరిష్కారం కాదని అన్నారు. కార్మికులందరూ తమ కుటుంబాల గురించి ఆలోచించి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు చంద్రబాబు.
అధికార పార్టీకి దూరంగా సీపిఐ.. హుజూర్ నగర్ లో మద్దత్తు ఉపసంహరణ..
తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పదిరోజుల క్రితం అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి నట్టు చాడా వెంకటరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ అవలంభిస్తున్న వైఖరి దారుణమన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పదిరోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం శో,నీయమన్నారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా సుమారు 48వేల మంది కార్మికులను అకారణంగా తొలగించారన్నారు. కొత్త రిక్రూట్ మెంట్ ను ప్రకటించి నిరుద్యోగులు, కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకువచ్చిందని చాడ ఆందోళన వ్యక్తం చేశారు.