ఒకప్పుడు చక్రం తిప్పారు..ఇప్పడు చతికిల బడ్డారు.! గులాబీ వనంలో వినిపిస్తున్న విషాదగీతాలు..!!
హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చాలా వింతగా, విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయి. ఓడలు.. బండ్లుగా మారతాయి. బండ్లు.. ఓడలుగా మారతాయి. తాజా రాజకీయాల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. బండ్లుగా మారిన ఓడల్లాంటి ఇద్దరు నాయకుల గురించి చర్చ జరుగుతోంది.మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి, వరంగల్ జిల్లాలో కడియం... ఒకప్పుడు ఓటమెరుగని 'ఓడ' లాంటి నేతలు. ఇప్పుడు 'బండి' లా మారి, ముందుకు కదల్లేక చతికిలపడ్డారు. అక్కడ ఆయన... ఇక్కడ ఈయన... ఇద్దరూ ఒంటరి పక్షుల్లా మిగిలారు...!
గులాబీ పార్టీ లో సినియర్ల మనో వేదన..! ఆదరణ కరువైన నేతలు..!!
ఆయన పేరు జూపల్లి కృష్ణారావు. తెలంగాణ తొలి చంద్రశేఖర్ రావు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన తన మహబూబ్ నగర్ జిల్లాలో ఆధిపత్యం చెలాయించారు. ఆయన వ్యవహార తీరు ఏమాత్రం నచ్చకపోవడంతో ఆ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దూరమయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా అంతటా గెలిచిన టీఆర్ఎస్, ఒక్క కొల్లాపూర్ లో మాత్రం ఓడింది. అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఈయనపై కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. ఆయనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని, జూపల్లి ఓటమికి కుట్ర పన్నారని ఆ జిల్లాలో బాహాటంగా చర్చలు సాగాయి.
కొత్తొక వింత.. పాతొక రోత..! అలా తయారయ్యింది వారిద్దరి పరిస్థితి..!!
జూపల్లి గెలిస్తే మళ్లీ మంత్రి పదవి దక్కేదేమో. ఓటమితోపాటే టీఆర్ఎస్ పార్టీలో పరపతి కూడా కోల్పోయారు. జూపల్లిని ఓడించిన హర్షవర్ధన్ రెడ్డి, గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు అక్కడ ఆయనే కింగ్. మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన వైపే ఉన్నారు. మొన్నటి పరిషత్ న్నికల్లోనూ హర్షవర్ధన్ రెడ్డే మొత్తం చూసుకున్నారట. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆయనకే సపోర్ట్ చేసిందట. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన జూపల్లి... ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒంటరిగా మిగిలిపోయారట. పాపం.... జూపల్లి... నియోజకవర్గంలోని అధికారులుగానీ, పోలీసులుగానీ... ఇప్పుడు జూపల్లి మాటే వినడం లేదట. ఏమాత్రం లెక్కచేయడం లేదట.
పట్టించుకోని కేసీఆర్..! అయోమయంలో ఆ ఇద్దరు నేతలు..!!
ఆయన పేరు కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత కాలంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన కడియానికి చంద్రశేఖర్ రావు రెండో మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కేవలం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. చంద్రశేఖర్ రావుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన .. ప్రస్తుతం వ్యూహాత్మక మౌనవ్రతం పాటిస్తున్నారు.
కేసీఆర్ మొదటి క్యబినెట్లో మంత్రులు..! ప్రస్తుతం కనీసం గుర్తింపు కరువు..!!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలకు దిగడం ద్వారా... ఈయన తనకు తానే దెబ్బతీసుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ టికెట్ను తన కుమార్తె కావ్యకు ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినప్పటికీ కడియం సర్దుకుపోయారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తనకు సమకాలీకుడైన ఎర్రబెల్లి దయాకర్రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని మాత్రం కడియం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్నీ తానై నడిపిన నేత.. ఇఫ్పుడు సాదాసీదాగా మారారు. పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రాధాన్యం తగ్గింది. అందుకే, మౌనవ్రతం పూనారు.