ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?
తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవారం ఉదయం రక్తపు మరకలు కనిపించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సమ్మక్క-సారలమ్మ గద్దెకు సమీపంలో ఉన్న మల్లన్నగండి రిజర్వాయరులో ఓ మృతదేహం కనిపించడంతో తండావాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఓటింగ్ ను బహిష్కరించిన బంధంపల్లి గ్రామస్తులు .. ఎందుకంటే
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్క్వాడ్, క్లూస్టీంలతో హత్య జరిగిన ప్రాంతం నుంచి పలు ఆధారాలను సేకరించారు . మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఈ హత్యకేసులో మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుందని చెప్తున్నారు. హతుడి వయసు 45 వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం రాత్రి గద్దెల వద్ద అతడిని హత్యచేసి అనంతరం మృతదేహాన్ని రిజర్వాయర్లో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతుడి తల లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తీరును బట్టి చూస్తే ఇది కచ్చితంగా నరబలే అయి ఉంటుందని అనుమానిస్తున్నట్టు డీసీపీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు, మంగళవారం సాయంత్రం కొందరు వ్యక్తులు రెండు ఇన్నోవా కార్లలో రిజర్వాయర్ వద్దకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇది బయటి వ్యక్తుల పనేనని అనుమానిస్తున్నారు. అయితే, మృతుడి జేబులో గాజులు, లేడీస్ వాచ్ లభ్యమయ్యాయని, హత్యకు ముందు అతడి కాళ్లను చున్నీతో కట్టివేశారని చెబుతున్న పోలీసులు.. వివాహేతర సంబంధం కూడా కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సమ్మక్క , సారలమ్మల గద్దె వద్ద జరిగిన ఘటన నరబలిగా గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.