ఇంటర్ పై ఎరుపెక్కిన రాష్ట్రం..! అన్ని కలెక్టరేట్ల ముట్టడి..! గవర్నర్ కు అఖిలపక్షం వినతిపత్రం..!!
హైదరాబాద్ : తెలంగాణ రాష్టం కలెక్టరేట్ల ముట్టడితో అట్టుడికింది. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఉద్యమించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కలక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండేటి శ్రీధర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉగ్ర రూపం దాల్చిన ఇంటర్ నిరశనలు... ! 31 జిల్లాల్లో కాంగ్రెస్ కలెక్టరేట్ల ముట్టడి..!!
ముట్టడి సందర్భంగా విజయశాంతి తెలంగాణ ముఖ్యంత్రి చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. 20 మంది పిల్లలు చనిపోయినా ఆయనలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై దొర ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. విద్యార్థులు అధైర్యపడి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దనీ, వారికి తాము అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇంటర్ విద్యార్థుల కోసం తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు..! సూర్యాపేటలో ఉత్తమ్ అరెస్టు..!!
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్..ఖమ్మంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి, వరంగల్ లో పాల్గొన్న ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, సిద్దిపేట లో టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్యెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్యెల్సీ రాములు నాయక్, హైద్రాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజయశాంతి అరెస్టు..! మండిపడ్డ రాములమ్మ..!!
కాంగ్రెస్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, కోదండ రెడ్డి లను నారాయణ్ గూడ, పొన్నాల లక్షయ్యను రాజగోపాల్ పెట్ పోలీస్ స్టేషన్ కు, రాములు నాయక్ ను నాంపల్లి పోలీస్ స్టేషన్లకు, మల్రెడ్డి రంగారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
గవర్నర్ ను కలిసిన అఖిల పక్షం..! ఇంటర్ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని విజ్నప్తి..!!
ఇక ఇదే అంశం పై అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ కలిసారు. రాజ్ భవన్ లో ఇంటర్ ఫలితాల అవకతవకల గురించి ఫిర్యాదు చేసారు అఖిల పక్ష నేతలు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ, పోలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ది రెడ్డి, బట్టి విక్రమార్క, కోదండరామ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఇంటర్ బోర్డ్ లో చెలరేగిన సమస్యపట్ల గవర్నర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు గవర్నకు విజ్నప్తి చేసారు.