మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తున్న అవ్వ కథ .. నిరుపేదకు సంక్షేమ పథకాలు అందని వ్యధ
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలియదు కానీ నిరుపేదలకు మాత్రం సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానన్న సర్కార్ ఎవరికి ఇల్లిచ్చినా ఇంకా కనీసం నిలువనీడలేని పేదసాదలు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది ఓ అవ్వ కథ . తాను నివాసం ఉండే గుడిసె కూలిపోతే టాయిలెట్ లోనే జీవనం సాగిస్తున్న ఓ అవ్వ వ్యధ మన సంక్షేమ పథకాల అమలుతీరుకు అద్దం పడుతుంది.
మనసును కలచివేసే నిజామాబాద్ రుద్రూరు అవ్వ కథ
నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామంలోని ఓ అవ్వ కథ చూపరుల మనసులను కలచివేస్తుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం (ఆర్) గ్రామానికి చెందిన ఇసుక నాగవ్వ, కుమారుడు చేపలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వారు నిరుపేద మత్స్యకారులు. వర్షాకాలంలో వారు నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోయింది. నిలువ నీడలేని ఆ తల్లీ కొడుకు దిక్కుతోచని స్థితిలో మరుగుదొడ్డినే ఆవాసంగా చేసుకుని నానా కష్టాలు పడుతున్నారు.
నిలువనీడలేక మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తున్న అవ్వ
గత వర్షాకాలంలో పూరిగుడిసె కూలిపోవటంతో వారికి నీడ కరువైంది. మళ్ళీ గుడిసె నిర్మించుకునే ఆర్ధిక స్తోమత లేదు. ఏ పూటకాపూట కష్టం చేసుకునే కడుపు నింపుకోవాలి. దీంతో ఆ తల్లీ , కుమారుడు చేసేది లేక మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటున్నారు. అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ ఈ పేద కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు . కనీసం ఏ అధికారులు ఈ కుటుంబంపై జాలి కూడా చూపలేదు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించమని వినతి
దీంతో వారు నివాసం ఉండేందుకు మరుగుదొడ్డే దిక్కయింది. పగలు మరుగుదొడ్లోనే నివాసముంటున్న వారు , రాత్రివేళ బయట పడుకుంటున్నారు. తమ గోడు ఏ అధికారులకు పట్టటం లేదని నాగవ్వ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఎవరు కనిపించినా తన బాధ చెప్పి కన్నీటి పర్యంతమవుతుంది ఆ వృద్ధురాలైన తల్లి. రెక్కాడితే కాని డొక్కాడని తమను ప్రభుత్వం ఆదుకుని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని కోరుతున్నారు.
సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందని ద్రాక్షేనా ?
ఇదీ మన సంక్షేమ పథకాల అమలు తీరు. మన రాష్ట్రంలో నిరుపేదల పరిస్థితి ఎలా ఉందో చెప్పటానికి ఒక్క నాగవ్వ కథ చాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాగవ్వకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. ఒక్క నాగవ్వనే కాదు ఇంతే దారుణమైన పరిస్థితుల్లో జీవనం వెళ్లబుచ్చుతున్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తేనే సంక్షేమ పథకాల ప్రయోజనం నెరవేరుతుంది.