తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరు
ఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఆయన సాహితీ కృషి నిరుపమానమైనది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆ మహానుభావుడు ద్వానా శాస్త్రి తెలుగు సాహిత్య లోకాన్ని శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. సోమవారం అర్థరాత్రి ఆయన తిరిగి రాని లోకాలకు చేరిపోయారు.
ద్వానా శాస్త్రిగా పేరుగాంచిన ఆయన పూర్తి పేరు ద్వాదశి నారాయణ శాస్త్రి. ఆయన వయస్సు 72 ఏళ్లు.ఆయన తెలుగు సాహిత్య చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలూ రాశారు.
సమాధిలో స్వగతాలు-వచ న కవిత, వాఙ్మయ లహరి- వ్యాససంపుటి, సాహిత్య సాహి త్యం - వ్యాస సంపుటి, మారేపల్లి రామచంద్ర కవితా సమీక్ష-ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం, ద్రావిడ సాహిత్య సేతువువ్యాస ద్వాదశి, వ్యాస సంపుటి అక్షర చిత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు సాహిత్య సంస్థలు - పీహెచ్డీ సిద్ధాంత వ్యాసం, ఆం ధ్ర సాహిత్యం, మన తెలుగు తెలుసుకుందాం, ద్వానా కవితలు, శతజయంతి సాహితీమూర్తులు సంపాదకత్వం,తెలుగు సాహిత్య చరిత్ర, నానీలలో సినారె, సినారె కవిత్వంలో ఉక్తులు, సూక్తులు వంటి పలు గ్రంథాలను ఆయన వెలువరించారు.తెలుగు సాహితీ వినీలాకాశంలో వెలుగు వెలిగి, తెలుగు భాషా ప్రియులకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథాలను రచించిన సాహితీమూర్తి లేని లోటు తెలుగు భాషామతల్లి కి తీరని లోటు.