నేటి నుండి దంచికొట్టనున్న ఎండలు .. ఆస్పత్రుల్లో వడదెబ్బ విభాగ ఏర్పాటు
తెలంగాణలో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడంతో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ సోమవారం నుంచి ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
ఆస్పత్రుల్లో వడదెబ్బ విభాగం ఏర్పాటు చెయ్యనున్న అధికారులు
ఎండల బారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రత్యేక కార్యాచరణ పై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ శాఖ అందించిన ప్రణాళికను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు వడదెబ్బ బాధితులకు ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాపతంగా వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని వడదెబ్బ బాదితులను కాపాడేందుకు అందరూ సిద్ధంగా వుండాలని సూచించారు. బాధితుల్లో అధిక సంఖ్యలో పేదలు, దినసరి కూలీలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వై కే రెడ్డి తెలిపారు.
ఎండల తీవ్రత ... వాతావరణ కేంద్రం సూచనలు
ఈసారి ఎండతో పాటు వడగాలులు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మధ్యాహ్నం సమయంలో 12 గంటల నుండి నాలుగు గంటల వరకు బస్సు సర్వీసులు నిలిపివేయాలని ప్రయాణాలు సైతం ఆపేయాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఉపాధి హామీ కూలీలు కార్మికులు పనిచేసే చోట టెంట్లను ఏర్పాటు చేయాలని అంతేకాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, ఆశావర్కర్లు, పారామెడికల్ సిబ్బంది కి వడ దెబ్బ తగిలితే ఆయన వైద్యం అందించాలి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రధాన కూడళ్లలో తాగునీటి వసతి కల్పించాలని, ప్రయాణాలు చేసే వారికి సైతం తాగునీటిని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.ఇక వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ఎండల తీవ్రత హెచ్చరికలు జారీ చేస్తూ మిగతా విభాగాలను అప్రమత్తం చేయడంతో పాటు, ప్రజలను సైతం అప్రమత్తం చేయనుంది.
కోస్తాలో భిన్నమైన పరిస్థితి
మరోవైపు కోస్తాలో మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం,ఉభయ గోదావరి జిల్లాల్లోపిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.