నగరంపై కన్నేసిన మూడో నేత్రం..! సీసీ కెమెరాల నిఘాలో గణేష్ మండపాలు..!!
హైదరాబాద్:హైదరాబాద్ మహా నగరాన్ని మూడో నేత్రం కమ్మేసింది. నగరాన్ని మొత్తం తన కను సన్నల్లో శాశిస్తోంది నిఘా నేత్రం. దేశ పరిస్థితులు ఉత్కంఠభరితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వినాయక చవితి నవరాత్రులను ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిర్వహించాలనే అంశం పోలీసులకు సవాల్ విసురుతోంది. నగర పోలీసుకు కూడా గణేష్ నవరాత్రులను ఛాలెంజ్ గా తీసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా నగరాన్ని మొత్తం త్రినేత్ర మయం చేసారు పోలీసులు. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రతి మండపానికి పోలీసులు జియో ట్యాగింగ్ చేశారు. దీంతో ఒక క్లిక్ తో పోలీసు అధికారికి వినాయక మండపాలు ఎక్కడెక్క ఉన్నాయో నిమిషాల్లో తెలిసిపోతుంది. కేవలం మండపాలే కాదు వాటి నిర్వహకుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇలా అన్ని విషయాలు పోలీసుల దగ్గర ఉంటాయి. ఈ సౌకర్యంతో పోలీసులు ప్రతి రోజు దశల వారిగా పెట్రోలింగ్, గల్లీ గస్తీ, అధికారుల పర్యవేక్షణ సులభంగా జరుగుతుందని స్పష్టం చేసారు.
దీనికి తోడు ఈసారి మండపాలు ఏర్పాటు సమయంలో సీసీ కెమెరాలు అమర్చుకుని డాటాను భద్రపర్చుకోవాలని పోలీసు కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్ కోరుతున్నారు. సీసీ కెమెరాలు లేని మండపాల వద్ద కమ్యూనిటీ సీసీ కెమెరాలను వాడుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే నవరాత్రి బందోబస్తుతో పాటు 12న జరిగే నిమజ్జనోత్సవం ఏర్పాట్లకు పరడ్బంధీ ప్రణాళికను రూపొందించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ పోలీసు రికార్డులో ఉన్న క్రిమినల్స్ కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు కొత్త వాళ్ల సంచారంపై కూడా ఆరా తీస్తున్నారు. సెక్టారులుగా వినాయకులను ఏర్పాటు చేసిన ప్రాంతాలను విభజించి సబ్ ఇన్స్పెక్టర్లకు పూర్తి బాధ్యతను అప్పగించారు. సైబరాబాద్లో 10871, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 9387 వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేశారు. ఈసారి కొత్తగా ఏర్పడిన కాలనీలు ఉండడంతో మండపాల ఏర్పాటు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు పోలీసు కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల సంఖ్య 20 వేలు దాటుతుందని అధికారులు స్పష్టం చేశారు.