ఆర్టీసి బస్సులతోనే ట్రాఫిక్ సమస్య! మిని బస్సులతో సమస్యే ఉండదంటున్న వాహన దారులు!
హైదరాబాద్ : తెలంగాణ రోడ్ల మీద బస్సులు సంపూర్ణంగా తిరిగి రెండు నెలలు కావస్తోంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేసిన ఆర్టీసి కార్మికులు ఏ ఒక్క డిమాండ్ పట్ల ప్రభుత్వ హామీ లేకుండానే సమ్మెను విరమించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కిరాకుండానే కొండెక్కిపోయింది. దీంతో కార్మికులు ఓడిపోయారా..? పట్టుదలగా వ్యవహరించిన ప్రభుత్వం పంతం నెగ్గించుకుందా..? అనే అంశం పక్కన పెడితే ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు ప్రయాణీకులు అలవాటు పడ్డారన్నది మాత్రం వాస్తవం.
బస్సులు రోడ్ల మీద తిరగక పోవడంతో ట్రాఫిక్ కు ఎక్కడా అంతరాయం లేకుండా సాఫీగా ముందుకు సాగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజల నుండి, వాహనదారుల నుండి ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు వస్తోంది. మిని బస్సుల అంశాన్ని గత శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రస్తావించారు. దీంతో మినీ బస్సుల ఆవశ్యకత గురించి నగర ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బస్సుల బంద్ ప్రభావం..
నగర జనాభా గణనీయంగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టే వాహనాలు కూడా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. నగర రోడ్లను ఆక్రమించిన భవంతులను తొలంగించి రోడ్లను ఎంత వెడల్పు చేసినా పెరిగిన వాహనాల ద్వారా తరుచుగా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతూనే ఉంటుంది. ప్రధాన కూడళ్లలో ఈ అంతరావయం మరింత ఘోరంగా ఉండడం చూస్తుంటాం. దీనంతటికి నగరంలో పెరిగిపోయిన కార్లు, ఇతర వాహనాలతో పాటు నగరంలో తిరుగుతున్న బస్సులు కూడా కారణంగా తెలుస్తోంది. క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న బస్సుల వల్ల నగర రోడ్లన్నీ నిండిపోవడమే కాకుండా వాహనాల అంతరాయానికి కారణం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది.
సగం రోడ్డును ఆక్రమిస్తున్న బస్సులు..
గత రెండు నెలలుగా బస్సులు నగర రోడ్ల మీద తిరగక పోవడంతో ట్రాఫిక్ సమస్య అంతగా కనిపించడం లేదనే వాదన వినిపిస్తున్నది. నగరంలో సుమారు రెండువేల బస్సులు నిత్యం అనేక రూట్లలో తిరుగుతుండం తెలిసిందే. అత్యంత పొడవైన బస్సులు కావడంతో మలుపుల దగ్గర, బాటిల్ నెక్ ప్రాంతాల్లో, యూటర్న్ దగ్గర చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోతున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. అనుకోకుండా ఆర్టీసి బస్సు సాంకేతిక లోపంతో రోడ్డు మీద ఆగిపోతే ఇక నగరవాసులకు ఆ రోజు నరకమే. ఇలాంటి తరుణంలో ఆర్టీసి బస్సుల గురించి నగర వాహన దారులు ఓ కొత్త ప్రతిపాదన వినిపిస్తున్నారు.
ఆర్టీసి బస్సులకు ప్రత్యామ్నయం చూడండి..
నగర రోడ్లను మొత్తం ఆక్రమిస్తూ, నిత్యం ట్రాఫిక్ సమస్యకు కారణమయ్యే ఆర్టీసి బస్సుల స్దానంలో మిని బస్సులను ప్రవేశ పెట్టాలనే డిమాంగ్ వినిపిస్తోంది. మిని బస్సులు చిన్నగా ఉంటాయి కాబట్టి ములుపుల దగ్గర పెద్దగా సమస్య ఉండక పోవడంతో పాటు వాహనాలకు అంతగా అంతరాయం ఉండదనే ప్రతిపాదన వినిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న బస్సుల నుండి పొగ రూపంలో కాలూష్యం వెలువడుతోందని, అలాంటి ప్రమాదకర బస్సులను శాశ్వతంగా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అసలు నగర రోడ్ల మీద అంత విశాలమైన బస్సులు అవసరం లేదనే వాదన వినిపిస్తున్నారు నగర వాహన దారులు. దీంతో సమ్మె పుణ్యమా అని ప్రజా రవాణా వ్యవస్ధపై ప్రజల్లో ఓ విధమైన చైతన్యం వచ్చినట్టు నిర్దారణ అవుతోంది.
మిని బస్సులతై ఎంతో ఉపయోగం..
నగర వాహన దారులు చేస్తున్న ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగరంలో తిరుగుతున్న వేలాది బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడటం,వాతావరణం కాలుష్యం కావడం, తరచూ ప్రమాదాలు జరగడం కూడా మనం చూస్తున్నాం. ఈ సమస్యల నుండి బయటపడేందుకు మిని బస్సులే శరణ్యమని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న బస్సుల స్దానంలో మిని బస్సులను ప్రవేశ పెట్టేందుకు మరి కొద్ది సమయం తీసుకోవచ్చు. ప్రయాణీకులు ఎలాగూ ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్ధకు అలవాటు పడ్డారు కాబట్టి సమయం తీసుకున్నా సరే ప్రభుత్వం మిని బస్సులను ప్రవేశ పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించకుండా మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోలతో పాటు ర్యాపిడో వాహనాలు అందుబాటులో ఉండడంతో ప్రయాణీకులకు అంతగా ఇబ్బందులు ఉండవనే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆటోలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో ఎవరీకి అంత సమస్యాత్మకంగా మారక పోవచ్చు.