టీ కాంగ్రెస్ బస్సుకు శిక్షణ పొందిన డ్రైవర్ కావలెను..! అర్హత గలవారు గాంధీభవన్ లో సంప్రదించాలి..!!
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదిపినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బంగపాటు తప్పలేదు. అంతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నామన్న సంతోషాన్ని ఆవిరి చేస్తూ గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోతున్నారు. ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఏ క్షణాన కారు ఎక్కేస్తారో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు మిగిలిన నేతలు. అయినా.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని గంపెడాశలో ఎదురుచూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే కేంద్ర పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో పార్టీని నడిపించేందుకు ఓ మంచి నాయకత్వం అవసరమని గాంధీ భవన్ లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
లోక్ సభ ఫలితాల తర్వాత పార్టీలో మార్పులు..! పిసీసీ పదవి ఎవరికో..!!
పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కోట్లాట మాత్రం కొనసాగుతూనే ఉంది. సీనియర్ నేతలు కూడా రేపో..మాపో రాహుల్ పీఎం అయితే.. తాము రాష్ట్రంలో చక్రం తిప్పుతామనే భావనతో ఉన్నారు. ఇంతకీ.. అసలు విషయమ ఏమిటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ను ఎవరు నడిపించాలి. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరు సారథ్యం వహించాలనే విషయమై అంతర్గతంగా కుమ్ములాటలు కూడా మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది.
నేతల మద్య అంతర్యుద్దం..! ఏకాభిప్రాయం ఎప్పటికో..!!
గాంధీభవన్లో అయితే ప్రపంచానికి తెలుస్తుందనే ఉద్దేశంతో అంతర్గత సమావేశాల్లో బహిరంగాంగానే నేతలు నిందించుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం నాలుగైదు చోట్ల గెలిచి తమ బలం తిరిగి సాధించుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచన. అయితే.. నేతల్లో మాత్రం.. ఎవరికి వారు పక్క నాయకుడు ఓడిపోవాలని గుట్టుగా ప్రత్యర్థి పార్టీకి సాయపడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మల్కాజిగిరి, చేవెళ్ల, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తమ గెలుపు సునాయాసమనే ధీమాతో ఉన్నారు. అయితే అక్కడ గులాబీ పార్టీతో పాటు, బీజేపీ కూడా ధీటుగా పోటీ ఇవ్వటంతో కాంగ్రెస్ ఆశలు రెండుకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
పార్టీని నడిపించే సమర్థవంతమైన నేత కావాలి..! పేర్లను పరిశీలిస్తున్న అదిష్టానం..!!
కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే.. అది తెరాసకు ఇబ్బందికరమే అనే వాదన వినిపిస్తుంది. అదే నల్గొండలో ఉత్తమ్కుమార్రెడ్డి గెలిస్తే.. మరోసారి పీసీసీ చీఫ్గా చక్రం తిప్పుతారు. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి తన భార్య పద్మావతిని పోటీ చేయించి గెలిపించుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఓడితే మాత్రం ఇప్పటి వరకూ పీసీసీ పీఠాన్ని ఆశపడుతున్న వారి పంట పండినట్టుగానే భావించొచ్చు.
లోక్ సభ ఫలితాలు ఆశించినట్టు వస్తే ఓకే..!లేకపోతే డ్రైవర్ మార్పు తప్పదు..!!
మరోవైపు విజయశాంతి, రేణుకాచౌదరి కూడా పార్టీలో పవర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన.. విజయశాంతి తన ప్రసంగాలతోనే కాంగ్రెస్ను గెలిపించారనే విషయాన్ని ఢిల్లీ నాయకులకు వినిపిస్తారు. ఖమ్మంలో రేణుకాచౌదరి గెలిస్తే.. పార్టీ అధికారం కూడా తనకే కట్టబెడితే.. ఇదే రీతిలో రాష్ట్రంలో గులాబీ పార్టీకు వ్యతిరేకంగా అందర్నీ ఏకం చేస్తాననే వాదన ఆమె వినిపిస్తున్నారు. మరి ఈ లెక్కన.. వీహెచ్ నుంచి రేణుకాచౌదరి వరకూ పోటీపడుతున్న తెలంగాణ నాయకత్వాన్ని ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఎవరికి కట్టబెడతారో చూడాలి.