లోక్ సభ అభ్యర్థులను ఇంకా తేల్చని టీటిడిపి..! ఆశావహుల్లో పెరుగుతున్న అసహనం..!!
హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ప్రచారానికి ప్రజా క్షేత్రంలో పరుగులు తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో తెలంగాణ తెలుగుదేశం మాత్రం వెనగబడిపోతున్నట్టు తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గాల్లో ఏయే స్థానాల నుంచి పోటీ చేయాలనేది తెలుగుదేశం తెలంగాణ శాఖ ఇంకా తేల్చలేదు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు రమణ, సీనియర్ నేతలతో సమీక్షించారు.
టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు దరఖాస్తులిస్తున్నారు. పార్టీకి బలం లేని స్థానాల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని పలువురు సూచించారు. మొత్తం 17 స్థానాల్లో మహబూబ్నగర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇంతవరకూ ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. పలు స్థానాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే అందినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి టికెట్ కావాలని ముగ్గురు స్థానిక నేతలు పోటీ పడుతున్నారు.
ఎన్నికల శిక్షణకు రానని మొరాయించిన అదికారులు..! గైర్హాజరైనవారికి షోకాజు నోటీసులు..!!
ఇక ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెరాసలోకి వెళుతున్నందున ఆ టికెట్ తనకు ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెదేపా నేత కోనేరు చిన్ని గట్టిగా అడుగుతున్నారు. సికింద్రాబాద్ టికెట్ను పలువురు ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి చెందిన నేతలు ఎన్టీఆర్ భవన్లో సమావేశమై ఎన్నికలపై చర్చించారు. ఈ స్థానంలో పోటీ చేయాలని వారు తీర్మానించారు.
ఎవరిని నిలబెట్టినా మద్దతిస్తామని తీర్మానించి రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపారు. భువనగిరి లేదా నల్గొండ టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి ఒత్తిడి తెస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పొత్తు కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెదేపా అసలు ఎన్నికల బరిలోకి దిగలేదని, ఈ ఎన్నికల్లోనూ ఎక్కడా పోటీ చేయకపోతే కార్యకర్తలు నిరాశకు గురవుతారని ఆమె చెప్పుకొస్తున్నారు.