జీవితంపై వేటు వేసిన వెండి రాఖీ..! ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భర్త ఆత్మహత్య..!!
Recommended Video
వరంగల్/హైదరాబాద్ : పచ్చని సంసారం.. పారాణి ఆరని కాపురం. నిండు నూరేళ్లూ కలిసి ఉందామని ఒక్కటైన జంట. చిన్న అభిప్రాయ భేదం వారి జీవితాల్లో శాశ్వత చీకటిని నింపింది. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన బంధం పుటుక్కున తెగిపోయింది. చిన్న విషయంలో రాజీ పడని వారి మనస్తత్వాలకు తగిన మూల్యం చెల్లించుకున్నట్టైంది. ఎంతో ఉన్నతంగా జరుపుకుందామనుకున్న రక్షా బంధన్ పండగ వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంది.
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. చిన్న ఇగో నిమిషాల్లో పెరిగి పెద్దదై శాశ్వతంగా తనువు చాలించే వరకూ వెళ్లింది. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటన వరంగల్ పట్టణంలో చోటుచేసుకుంది. అన్నయ్యలకు వెండి రాఖీ కడతానని భార్య అంటే.. అవసరం లేదు అని భర్త.. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. అంతే.. తెల్లారేసరికి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్క సారిగా వారి జీవితాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది.
హన్మకొండ ఎస్సై కొంరెల్లి, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన ఇరవై మూడేళ్ల రవీంద్రాచారి రెండు నెలల క్రితం వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హన్మకొండ కొత్తూర్, సుభాష్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో రవీంద్రాచారి ఆటో నపడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నా డు. ఆటోకు నెలవారి కిస్తీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ అధికారులు 15 రోజుల క్రితం ఆటోను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు రవీంద్రా చారి. రాఖీ పండగ వస్తుండడంతో మృతుడి రవీంద్రా చారి భార్య పుట్టింటికి గుడెప్పాడ్ వెళ్తానని, అన్నకు కట్టేందుకు వెండి రాఖీలు కావాలని కోరింది.
ఇదే విషయంలో మంగళవారం రాత్రి ఇద్దరు వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. బుధవారం లేచి చూసే సరికి రవీంద్రాచారి ముందు గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని కలిపించినట్లు మృతుడి భార్య తెలిపింది. వెంటనే విషయం పోలీసులకు తెలియడంతో హన్మకొండ ఎస్సై కొంరెల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి పోసుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.