కరీంనగర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ ఇద్దరు టీడిపి నేతలు..! ఎన్నికల్లో గెలుస్తారా..?
హైదరాబాద్: అసెంబ్లీని చంద్రశేఖర్ రావు రద్దుచేశాక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి పెరిగింది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అంతేకాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల పొత్తులో భాగంగా కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎల్.రమణ, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు టీ-టీడీపీ సీనియర్లు కాంగ్రెస్ మద్ధతుతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటైన పోటీ ఇస్తారనీ, ఆ రెండు చోట్ల గెలుపుకోసం అధికారపార్టీ సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుందనీ చర్చ జరుగుతోంది.
ఆ ఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేస్తారు..! స్థానికమా..? పట్టణమా..?
విపక్ష నేతల పొత్తు రాజకీయంతో సీనియర్ నాయకుల తలరాతలు మారిపోతాయా? కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఆ ఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేస్తారు? ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరి దారెటు? వారు ఎన్నికల రంగంలోకి అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నేతలు వలస పోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా డీలాపడింది. అయినప్పటికీ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం ఇంకా ఆ పార్టీ అస్థిత్వాన్ని కాపాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తులుగా కొనసాగుతున్నారు.
బలహీనపడిన పార్టీని బలోపేతం చేస్తున్న ఇరువురు నేతలు..!
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇద్దరు నేతల గురించి జిల్లాలో ఆసక్తికర చర్చ మొదలైంది. జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఈ ఇద్దరు నేతల్లో ఒకరు ఎల్.రమణ. మరొకరు ఇనుగాల పెద్దిరెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎల్.రమణ, పెద్దిరెడ్డి ఓ వెలుగు వెలిగిన వారే. ఒకరు పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజురాబాద్ నియోజకవర్గంలో, మరొకరు జగిత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలుపొంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చక్రంతిప్పిన వారే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో పలువురు ముఖ్యనేతలు టీడీపీని వీడి వెళ్లిపోయారు. ఇటీవల రేవంత్రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో కలిశారు. దీంతో జిల్లాలో బలహీనపడిన పార్టీని కాపాడేందుకు ఈ ఇద్దరు నేతలు చేయని ప్రయత్నం లేదు.
కరీంనగర్ కు రమణ, పెద్దిరెడ్డి అండ..! ఎగరాలి జెండా..!!
హుజురాబాద్లో మంత్రి ఈటల రాజేందర్ తిరుగులేని శక్తిగా ఉన్నారు. కమలాపూర్ నుంచి, ఆ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలు విడుదలచేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఈటల గెలుపు నల్లేరుపై బండి నడకేనని అందరూ అనుకుంటున్న తరుణంలోనే ఇనుగాల పెద్దిరెడ్డి ఇక్కడినుంచి పోటీచేస్తారని ప్రచారం మొదలుకావడం గమనార్హం! ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో గెలుపొంది చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.
ఈటెలను ఓడించాలన్నదే లక్ష్యం..! కాంగ్రెస్ కూడా చేస్తోంది ప్రయత్నం..!!
కాంగ్రెస్ నుంచి ఈ స్థానం కోసం టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్రెడ్డి, ప్యాట రమేశ్ పోటీపడుతున్నారు. అయితే వీరెవరు ఈటల రాజేందర్కు సమఉజ్జీ కారనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. పెద్దిరెడ్డి అయితేనే ఈటలకు గట్టి పోటీ ఇవ్వగలరన్న మాట వినిపిస్తోంది. టీడీపీ బలాబలాల సంగతి ఎలా ఉన్నా ఈ ఇద్దరు నేతలు మాత్రం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం అయితే బెటర్గా ఉంటుందని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. మరోవైపు రమణ కూడా జగిత్యాల బరిలో దిగాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతున్నారట! మహకూటమి ఏర్పాటయ్యాక, సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం పై స్పష్టత వచ్చే అవకాశం లేదు.