టీఆర్ఎస్ నేతలను భయపెడుతున్న ఆ రెండు అంశాలు..! హుజూర్ నగర్ లో ఈ సారైనా బయటపడేనా..?
హైదరాబాద్ : హుజూర్ నగర్ నియోజక వర్గంలో అదికార టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అందని ద్రాక్షాలాగే తయ్యింది. ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. హజూర్నగర్ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలుపు వాకిట్లోకి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో ఆ పార్టీ కొన్ని అంశాల్లో ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా కొన్ని పరిణామాలు గులాబీ నేతలను భయానికి గురిచేస్తున్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు.. ఈ సారి గెలవాలని పట్టుదలతో ఉన్న శ్రేణులు..
2018లో జరిగినట్టే ఈసారి కూడా జరుగుతుందా..? అనే అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. దీంతో గెలుపుపై ధీమా ఎంతగా వ్యక్తం చేస్తున్నారో.. లోలోపల మాత్రం ఓటమి భయం కూడా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గులాబీ నేతలు మరింత పకడ్బందీగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి ప్రయత్న లోపం లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఇంతకీ.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు ఏంటో ఒక సారి చూద్దాం.
గులాబీ నాయకులను కలవరపెడుతున్న పార్టీ గుర్తులు.. 2018 ఫలితం పురావృతం అవుతుందా అని ఆందోళన..
హుజూర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ప్రధానంగా భయపడడానికి మొదటి కారణం కారు గుర్తును పోలిన మరో రెండు గుర్తులు ఉండడం, రెండోది, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన ఉత్కంఠ పరిస్థితులు. ఈ రెండు అంశాలు గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మళ్లీ గెలుపు అంచులదాకా వచ్చి ఆగిపోతామా..? అనే అనుమానాలు గులాబీ నేతల్లో నెలకొంది. వాస్తవానికి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఉండడం వల్ల చాలా చోట్ల కొద్దిపాటి తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని ఆ పార్టీ నేతలతో పాటు స్వయంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. ఇదే అంశంలో ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్ ను కూడా సంప్రదించారు.
గుర్తుల పట్ల అవగాహన తీసుకొస్తున్న నేతలు.. ప్రచారంలో ఇదో అదనపు కార్యక్రమం..
ఇప్పుడు హుజూర్నగర్ ఉప ఎన్నికలో కూడా కారు గుర్తును పోలిన మరో రెండు గుర్తులు ఉండడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు గులాబీ నేతలు. ఈ నేపథ్యంలో గడపగడపకూ వెళ్లి, ప్రతీ ఓటరును కలుస్తున్నారు. ఎన్నికల గుర్తులపై అవగాహన తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఈ నెల 5వ తేదీ నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంది. పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారం పై ఇంకా స్పష్టత లేదు. మొత్తం నియోజక వర్గంలో అయోమయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ పై ఆర్టీసి సమ్మె ప్రభావం.. ప్రజలను ఒప్పించడం కష్టమే..
అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ప్రభుత్వంపై కొంత వ్యతిరేక భావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ ఉప ఎన్నిక గులాబీ శ్రుణుల్లో ఆందోళనను రేపుతోంది. కాగా, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి, అధికార టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుండి చావా కిరణ్మయి, బీజేపీ నుండి కోటా రామారావు రంగంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. టీడిపి నుండి కొంత మంది కీలక నేతలు ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో హుజూర్ నగర్ లో త్రిముఖ పోటీ తప్పదనే చర్చ కూడా జరుగుతోంది. అధికార గులాబీ పార్టీకి టీడిపి ఎవరి ఓట్లు కొల్లగొడుతుందోననే అభద్రతాభావంలో ఉన్నట్టు తెలుస్తోంది.