అపార అనుభవం అబాసుపాలయ్యింది..! రాజకాయాల్లో ఒంటరైన మోత్కుపల్లి..!!
హైదరాబాద్ : కొండంత అనుభవం బండరాళ్లు కొట్టడానికి కూడా పనికిరాదనే సామేత ఇప్పుడు ఆ నాయకుడి విషయంలో నిజమౌతోంది. రాజకీయాల్లో అపార అనుభవమున్న ఆ నేత ఇప్పుడు ఏ పార్టీకి కూడా కనిపించడం లేదు. కనీసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కూడా ఆహ్వానించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థతులు ఏ రాజకీయ నాయకుడికి రావొద్దని ఆయన అనుచరులు వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు వేడి సెగలై వ్యాపిస్తున్నా ఆ నేతలకు మాత్రం ఎలాంటి వేడి తగలకపోవడానికి కారణం ఏంటి..? ఎంత సేపు కంఠశోష తప్ప కార్యాచరణ కానరాని ఆ నేత ఎవరో.. ఆయన ప్రస్థానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
యెన్టీఆర్ సమకాలికుడు..! కాని ఏ రాజకీయ నాయకుడితో మాటల్ లేవ్ ..!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్న వారిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. అటువంటి నేత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబుపై బహిరంగంగానే పోరాటానికి దిగారు. అంతేకాదు, కాపు ఉద్యమ నేత ముద్రగడతోనూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోనూ చర్చలు కూడా జరిపారు.
చంద్రబాబుతో మోత్కుపల్లి వివాదం..! అదే ఆయన చేసిన అపరాధం..!!
అనంతరం తిరుపతి కాలి నడకన వెళ్లి ఏపీలో టీడీపీ ఓడిపోవాలని కూడా మొక్కుకున్నారు. ఇదంతా పక్కనపెడితే, తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి జరుగుతున్న వేళ ఆయన తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోత్కుపల్లి.. టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన తెలంగాణ బాధ్యతలు స్వీకరిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇవేమీ వర్కౌట్ కాకపోవడంతో మోత్కుపల్లి నర్సింహులు వచ్చే ఎన్నికల్లో తాను ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
ఏ పార్టీలో ఎంట్రీ లేదు..! ఏటికి ఎదురీదేందుకు నిర్ణయం..!!
ఏదో పార్టీలో చేరుతారనుకున్న మోత్కుపల్లి.. ఏ పార్టీలోనూ చేరకపోగా ఇండిపెండెంట్గా పోటీ చేయనుండడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన ప్రకటనతో తెలంగాణ ప్రజలు అవాక్కయ్యారు. కొద్దిరోజుల కిందట ఈ ప్రకటన చేసిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. అయితే, ఆలేరు నియోజకవర్గంలో మాత్రం ఆయన, అనుచరులు ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారట. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన మోత్కుపల్లి త్వరలో జరుగబోయే సాధారణ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని, ఇదే చివరిసారి అని, మళ్లీ పోటీ చేయనని వెల్లడించారు.
గతంమంతా ఘనకీర్తే...! తాజా రాజకీయాల్లో మాత్రం ఒంటరే..!!
అంతేకాదు, ఆలేరు ప్రజలు తనను అక్కున చేర్చుకుని ఐదుసార్లు, తుంగతుర్తి నుంచి మరోసారి గెలిపించి ఆశ్వీదించారని, తాను విద్యుత్శాఖ మంత్రిగా పనిచేసి ప్రతిగ్రామంలో ట్రాన్స్ఫారమ్లు ఏర్పాటు చేసి ప్రతిగ్రామానికి కరెంట్ అందించిన ఘనత తనకే దక్కిందని ఓటర్లకు గుర్తు చేశారు. మోత్కుపల్లి పరిస్థితిని చూసిన కొందరు ఆయనపై సెటైర్లు వేస్తుండగా, మరికొందరు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతకు ఇలాంటి గతి పట్టిందేమిటని జాలి చూపిస్తున్నారు. ఇన్ని పార్టీలను కాదని అక్కడి ఓటర్లు మోత్కుపల్లికి మద్దతు తెలుపుతారో లేదో చూడాలి.