రాళ్ళదాడి చేసింది గ్రామస్తులు కాదు .. కక్షతో కొందరు .. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై ఫిరాయింపు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ స్పందించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే , గిరిజన ఎమ్మెల్యే అయిన హరిప్రియ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి ఖమ్మంలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి వెళ్ళగా ఆమెపై రాళ్ళ దాడి చేశారు అయితే హరిప్రియ టీఆర్ఎస్ లో చేరడంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమెను అక్కడ ప్రచారం నిర్వహించకుండా అడ్డుకున్న నేపధ్యంలో చోటు చేసుకున్న ఘర్షణపై హరిప్రియా నాయక్ తన స్పందన తెలియజేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే పెట్టిన చిచ్చు.. ఖమ్మంలో రాళ్ళతో కొట్టుకున్న కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కార్యకర్తలు
Recommended Video
తమపై దాడి చేసింది కొన్ని దుష్ట శక్తులు అన్న హరిప్రియానాయక్
గోవింద్రాల గ్రామంలో తమపై దాడి చేసింది గ్రామస్తులు కాదని చెప్పారు హరిప్రియానాయక్. తాను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గత నెలరోజుల నుంచి పర్యటిస్తున్నానని హరిప్రియ తెలిపారు. ఎక్కడా తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ఆమె పేర్కొన్నారు. ఎక్కడా జరగని ఘటనలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన ఇల్లెందు ఎమ్మెల్యే తమపై దాడి వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని ఆరోపించారు.
తనపై జరిగిన దాడి గిరిజనులపై జరిగిన దాడి అన్న హరిప్రియా నాయక్
గోవింద్రాల గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిలో పలువురు టీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనపై ఉన్న కక్షతోటి ఈ దాడి చేయించారనీ, దీంతో తనపై దాడిచేస్తున్న వారిపై గోవింద్రాల ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. కామేపల్లి మండలంలో ప్రస్తుతం గడీల రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే హరిప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గిరిజన ఎమ్మెల్యేను అని చెప్పిన ఆమె తనపై జరిగిన దాడి గిరిజన మహిళలందరిపై జరిగిన దాడి అని అభివర్ణించారు.
ప్రజలంతా నా వెనుకే ఉన్నారన్న ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్
తనకు ప్రజాక్షేత్రంలో బలం వుందని, ప్రజలు తనను ఎప్పుడు ఆదరిస్తారని హరిప్రియ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఘటనకు కారణం అయిన బాధ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని ఆమె తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు ఈ ఘటన వెనుక ఉన్నా ప్రజలంతా తన వెనుకే ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.