ఆర్టీసీలో పనిచేసే భార్య ఉద్యోగం పోయిందని: మనస్తాపంతో భర్త మృతి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఆరవ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం మాత్రం తన నిరంకుశ విధానాలను వీడలేదు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా విభాగాల్లో పోస్టుల భర్తీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు సైతం చేస్తోంది. దీంతో ఆర్టీసీ కార్మిక కుటుంబాలలో ఆందోళన మొదలైంది.
దాదాపు 48600 మందని ఉద్యోగాల నుండి తొలగించామని సాక్షాత్తు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఒక కుటుంబాన్ని విషాదంలో నింపింది. తన భార్య ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన సంగారెడ్డి పరిధిలోని బాబానగర్ లో జరిగింది. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్నె కిశోర్ అనే వ్యక్తి ప్రైవేట్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇక అతని భార్య నాగరాణి ఆర్టీసీలో పని చేస్తోంది.సమ్మె నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, ఈ విషయమై వారిద్దరి మధ్యా చర్చ జరిగింది. ఉద్యోగం పోతే బ్రతకడం ఎలా అని భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వాదం జరుగగా, ఉద్యోగం పోతే బతకడం చాలా కష్టతరమవుతుందని కిశోర్ మానసిక వేదనకు గురయ్యారు.
దీంతో గత రెండు రోజులుగా భోజనం కూడా సరిగ్గా చేయకుండా అస్వస్థతకు గురయ్యాడు. నిన్న రాత్రి నిద్రలోనే గుండెపోటు వచ్చి మరణించాడు. కిశోర్, నాగరాణి దంపతులకు రెండేళ్ల పాప ఉంది.ఎంతో అన్యోన్యంగా సాగే వారి కాపురంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె , తరువాత జరిగిన పరిణామాలు చిచ్చు పెట్టాయి. కిశోర్ మృతితో ఓ కార్మిక కుటుంబంలో విషాదం అలముకుంది. తన భర్త మృతికి కేసీఆర్ విధానాలే కారణమని నాగరాణి ఆరోపిస్తున్నారు. భర్త మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు నాగరాణి. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకుంటే, తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం ఇంకెన్ని కార్మిక కుటుంబాలను రోడ్డు మీద పడేస్తుందో అన్న ఆందోళన నెలకొంది.