తాళం వేసిన ఇళ్లే టార్గెట్: అన్నాదమ్ములిద్దరూ దొంగలే, సీజ్ 11లక్షలు సీజ్
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సోదరులను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సోదరులను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 350 గ్రాముల బంగారు నగలు, 1600 గ్రాముల వెండి, టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అంగడి సురేశ్, అంగడి జంపయ్యలు ఇద్దరు అన్నదమ్ములు. వీరు చెడు అలవాట్లకు బానిసలుగా మారి చోరీలు చేస్తున్నారు. 2010 నుంచి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చారు.
చివరిసారిగా ఖమ్మం జిల్లా కామపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో దొంగతనం చేసి ఖమ్మం పోలీసులకు చిక్కి.. జైలుకు వెళ్లారు. ఏప్రిల్ 2016లో బెయిల్పై బయటకు వచ్చారు. జల్సాలకు అలవాటు పడిన వారికి బయట డబ్బులు దొరకకపోవడంతో తిరిగి చోరీలకు ప్రణాళిక రచించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డారు.
సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో మూడు, పరకాల, జనగామ, బచ్చన్నపేట పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు చొప్పున, కాజీపేట, కేయూసీ, మట్టెవాడ, రాయపర్తి, జఫర్గఢ్, ఎల్కతుర్తి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 15 చోరీలు చేసిన వీరు బంగారు, వెండి నగలను విక్రయించేందుకు టాటా ఏస్ వాహనంలో వరంగల్లోని ఆర్ఎన్టీ రోడ్డుకు వస్తుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నగలు, వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఇన్స్పెక్టర్ డేవిడ్రాజ్, సబ్ఇన్స్పెక్టర్ రమేశ్, సుబ్రహ్మణ్యేశ్వర్రావు, హెడ్కానిస్టేబుళ్లు సదయ్య, సుధాకర్, కానిస్టేబుళ్లు వంశీ, చంద్రశేఖర్, విశ్వేశ్వర్, జంపయ్యలను వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అభినందించారు.