దాసరి కుమారుడు అరుణ్కుమార్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగింది. రూ.8 లక్షల విలువగల ఆభరణాలు, 3లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. దీనిపై అరుణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగరంలోని జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో అరుణ్ కుమార్ తన భార్య, అత్తామామలతో ఉంటున్నారు. మే 31న అందరూ ఓ శుభకార్యానికి వేరే ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉండాల్సిన ఖరీదైన ఉత్పత్తులతోపాటు నగలు, కొంత నగదు మాయమైనట్లు గుర్తించారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 8లక్షలు ఉంటుందని తెలిసింది.
ఈ మేరకు అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన జూబ్లీహిల్స్ నేరపరిశోధన విభాగం నిందితుడిని గుర్తించి కొన్ని నగలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
కరీంనగర్: జిల్లాలోని గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం కురుత్యాల గ్రామానికి చెందిన 25మంది కరీంనగర్ జిల్లా గోదావరిఖని సమీపంలో మల్యాలపల్లి గ్రామానికి చెందిన తమ బంధువు అంత్యక్రియలకు లారీ వచ్చారు.
అంత్యక్రియల అనంతరం తిరిగి బయలుదేరి వెళ్తూ గోదావరిఖని వద్ద దారితప్పారు. దీంతో తిరిగి తమ మార్గంవైపు వెళ్తుండగా గోదావరిఖని పవర్ హౌజ్ సమీపంలో ఓ ట్రాలీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి అనిల్, బండారి కుమార్, బండారి లక్ష్మీ, బండారి చిన్నన్న, మాదరబోయిన ఐలయ్య, అప్పం తమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.