సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ: నిందితుడి అరెస్ట్, 20లక్షల సొత్తు రికవరీ
హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏడాది క్రితం జరిగిన చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు చేధించారు. ఆయన ఇంట్లో పనిచేసిన డ్రైవరే దొంగగా తేల్చారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు రూ. 20లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ , బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సంస్కృతి ప్యాలెస్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు గత ఏడాది అగస్టులో ఫంక్షన్కు హాజరుకావడానికి సొంతూరు వెళ్లారు.
తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్లకు లాకర్లో పరిశీలించగా ఖరీదైన నగలతో ఉన్న బాక్స్ కనిపించలేదు. దాంతో గత నవంబర్ 17న లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఊరెళ్లినప్పుడు ఇంట్లో పనిచేసే వారెవరైనా చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
పోయిన ఆభరణాల విలువ సుమారు రూ. 20లక్షల దాకా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ ఫోలీసులు అనుమానితులను ప్రశ్నించారు. ఇంట్లో పనిచేసిన వారిని, పనిమానేసిన వారిని పలుమార్లు ప్రశ్నించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అప్పటినుంచి అనుమానితులపై నిఘా కొనసాగిస్తున్న పోలీసులకు అక్కడే కొన్నాళ్ల పాటు డ్రైవర్గా పనిచేసిన ఇక్కుర్తి రవికుమార్( 30) వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. అతడి కదలికలపై ఆరా తీయగా చోరీకి పాల్పడింది రవికుమార్ అని తేలింది.
ఈ క్రమంలో రెండురోజుల క్రితం నిందితుడు రవికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. చోరీ సొత్తులో కొంతభాగాన్ని తాకట్టు పెట్టినట్లు, మరికొంత భాగాన్ని వేరేవాళ్లకు ఇచ్చినట్లు గుర్తించి మొత్తం సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా సహనంతో విచారణ కొనసాగించి కేసును చేధించిన బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, డీఎస్ఐ నాగరాజుగౌడ్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్తో పాటు క్రైం పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
కాగా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా ఆయన రైతుల సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.