కెనరా బ్యాంక్కు కన్నం: ఎస్బిఐలో చోరీయత్నం
మెదక్: మెదక్ జిల్లాలోని కెనరా బ్యాంక్కు దోపిడీ దొంగలు కన్నం వేశారు. భారీగా చోరీకి పాల్పడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కెనరా బ్యాంక్ గోడకు దోపిడీ దొంగలు కన్నం వేశారు. తద్వారా వారు బ్యాంకులోకి దూరి ముందుకు అక్కడున్న సిసిటీవి కెమెరాలను ధ్వంసం చేశారు.
ఆ తర్వాత దొంగలు లాకర్ గదిని కూడా ధ్వంసం చేశారు. అందులోని నగదును ఎత్తుకెళ్లారు. దాంతో పాటు బ్యాంకులో ఉన్న ఆరు కంప్యూటర్లను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. లాకర్ రూం వెనకవైపు గొడకు వాళ్లు కన్నం వేశారు. ఉదయం బ్యాంక్ తెరిచిన తర్వాత గానీ ఆ విషయం తెలియలేదు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి క్లూస్ టీమ్ వచ్చి అక్కడి ఆధారాలను సేకరించాల్సి ఉంది. అప్పటి వరకు ఎంత మొత్తం సొమ్ము పోయిందనే విషయం తెలిసే అవకాశం లేదు. ఇంత పెద్ద ఎత్తున పథకం వేసి చోరీ చేశారంటే ఇందులో ఇంటి దొంగల పాత్ర ఉండవచ్చుననే అనుమానం వ్యక్తమవుతోంది.
బాగా తెలిసినవారి పాత్ర దోపిడీలో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బ్యాంకులో రైతులకు బంగారం రుణాలు ఎక్కువగా ఇస్తుంటారు. దాంతో ఆ నగలు ఏమయ్యాయనే ఆందోళన కూడా రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఎస్బిఐలో చోరీకి విఫలయత్నం
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం వల్లికొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో గత అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశఆరు. బ్యాంకులోకి ప్రవేశించేందుకు గ్రిల్ను కట్టర్తో కోసేందుకు వారు ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో తలుపులకు మంటలు అంటుకున్నాయి. దాంతో దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.