కాకా కూతురు ఇంట్లో చోరీ: వేసిన తాళాలు వేసినట్లే...
హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి(కాకా) కూతురి ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న కాకా కుమార్తె విజయ తన ఇంట్లోని బెడ్రూమ్లో రెండు నెలల క్రితం కప్బోర్డులో తన బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె ఉంచారు.
వరలక్ష్మీ వ్రతం కావడంతో శుక్రవారం ఉదయం నగలు ధరించేందుకు పెట్టెను తీసిచూడగా కనబడలేదు. పెట్టెలు మాత్రం యధావిధిగా ఉన్నాయి. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో విజయ ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో మొత్తం ఎనిమిది మంది పనిమనుషులు పనిచేస్తారని, బెడ్రూమ్లో ఉన్న కప్బోర్డు తాళాలు పక్కనే ఉన్న మరో కప్బోర్డులో పెడతుంటానని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాయమైన బంగారం విలువ సుమారు రూ. 8లక్షల దాకా ఉంటుందని ఆమె చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆభరణాలు చోరీ, సెల్ఫోన్లు కూడా..
ఇదిలావుంటే, ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్ఫోన్స్ను ఎత్తుకెళ్లారు. హైదరాబాదులోని మొఘల్పుర పోలీసు స్టేషన్ పరిధిలోని బేలా కాలనీ అశోక్ పిల్లర్ ప్రాంతంలో నివసించే దేవి ప్రసాద్ ఆదివారం తెల్లవారు జామున లేచి మొదటి అంతస్తు బెడ్ రూంలోకి వెళ్లాడు.
డ్రెస్సింగ్ టేబుల్ వద్ద పెట్టిన నల్ల పూసల గొలుసుతో పాటు బంగారు గొలుసులు కనిపించలేదు. ఇంటి ప్రధాన తలుపులు సైతం తెరిచి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్థారించుకున్న దేవిప్రసాద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆల్మారాలో పెట్టిన గొలుసు మాయం
అల్మారాలో పెట్టిన బంగారు గొలుసు మాయమైంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నెం 12లోని రాక్లెవల్స్ అపార్ట్మెంట్లో నివాసముండే రమణ ఆప్టికల్స్ వ్యాపారం చేస్తుంటారు.
ఆయన ఇంట్లోనే ఉండే తల్లికి చెందిన బెడ్రూమ్లో అల్మారాలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు కనిపించడం లేదంటూ రమణ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన బంగారం విలువ సుమారు రూ.లక్షకు పైగా ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.