చోరీలో ఆసక్తికరం, ఫోటో తీసి: లలితా జ్యువెల్లరీ ఎండీ ఇచ్చిన ఆఫర్తోనే షాక్!
హైదరాబాద్: లలితా జ్యువెల్లరీ షాపులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడ్డారు. బురఖా ధరించి వచ్చిన మహిళలు పంజాగుట్టలోని ఆ షాపులో రూ.6 లక్షల విలువ చేసే బంగారా హారాన్ని దొంగిలించారు. విషయాన్ని గుర్తించిన సిబ్బంది సీసీటీవీలో పరిశీలించగా ఆ మహిళలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచి పరారయినట్లు తేలింది.
కాగా, ఈ చోరీలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. లలితా జ్యువెల్లరీలో మీకు నచ్చిన నగకు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఆ నగను మీ మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకోండి అని లలితా జ్యువెల్లరీ ఎండీ బంపర్ ఆఫర్ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. దానినే ఆ మహిళలు ఆయుధంగా ఉపయోగించుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.
అలా కుచ్చుటోపీ పెట్టి ఉంటారు
దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు తమకు నచ్చిన నగను ఫోటో తీసుకొని అత్యంత తెలివిగా రూ.6 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. గతంలో జరగని విధంగా ఇప్పుడు చోరీ జరిగిందని తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బురఖా ధరించిన ఇద్దరు మహిళలు పంజాగుట్టలోని లలితా జ్యువెల్లరీ షోరూంకు వచ్చారు.
ఖరీదైన ఆభరణాలు చూపించమని
తమకు ఖరీదైన హారాలు, ఆభరణాలు కావాలని అడిగారు. సిబ్బంది వాటిని చూపించారు. కొన్ని నగలను చూసిన ఆ మహిళలు వాటిని ఫోటో కూడా తీసుకున్నారు. సిబ్బంది దృష్టిని మళ్లించి 20 తులాల బరువు ఉన్న రూ.6 లక్షల విలువ చేసే నగను దొంగిలించారు.
రెప్పపాటులో అంతా జరిగిపోయింది
ఓ మహిళ తమ దుస్తుల్లో దానిని దాచేసింది. అదే సమయంలో రెండో మహిళ తన వద్ద ఉన్న నకిలీ నగను దాని స్థానంలో పెట్టింది. రెప్పపాటులో ఇదంతా జరిగింది. కాసేపటి తర్వాత వారు అక్కడి నుంచి జారుకున్నారు. అసలు నగలాగే ఉన్న నకిలీ నగ అక్కడే ఉండటంతో సిబ్బంది కూడా వారిని పట్టించుకోలేదు.
అలా విషయం వెలుగు చూసింది
అయితే, రెండు రోజుల క్రితం ఆ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి హారాలను లెక్కించి, వాటిని తూకం వేస్తున్నప్పుడు ఓ హారం తూకంలో తేడా వచ్చింది. పరిశీలించి చూస్తే అది నకిలీది అని తేలింది. అప్రమత్తమైన ఉద్యోగి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లారు. ఫుటేజీని పరిశీలించగా 3వ తేదీన బురఖాలో వచ్చిన మహిళలు చేసిన నిర్వాహకం బయటపడింది.
అలా చేసి ఉంటారు
లలితా జ్యువెల్లరీ యాడ్లో చెప్పిన విధంగా తమకు నచ్చిన నగను ఫోటో తీసుకొని అచ్చం అలాంటిదే మరో నకిలీ నగ తయారు చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. అలా చేయించిన హారాన్ని మళ్లీ 3వ తేదీన తెచ్చి, సిబ్బంది కళ్లుగప్పి అక్కడ పెట్టి అసలు హారంతో ఉడాయించి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇందుకు సంబంధించి దర్యాఫ్తు జరుపుతున్నారు.