ఇంట్లోనే.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సెల్ఫోన్ కొట్టేశారు
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఇంట్లో చోరీ జరిగింది. శనివారం రాత్రి సెల్ ఫోన్ను చార్జింగ్ కోసం పెట్టారు. ఉదయం చూసేసరికి ఆ ఫోన్ లేదు. దీంతో చోరీ విషయమై దత్తాత్రేయ ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దత్తాత్రేయ ఫోన్ను శనివారం నాడు రాత్రి ఆయన పీఏ చార్జింగ్ కోసం పెట్టారు. అయితే, ఉదయం చూసేసరికి ఫోన్ కనిపించలేదని దత్తాత్రేయ ముషీరాబాద్ పోలీసులకు వివరించారు. ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ పోయిందని చెప్పారు. తాను ఉదయం చూసేసరికి కనిపించలేదన్నారు.
ఫ్రెండ్ షిప్ క్లబ్ల పేరిట ఘరానా మోసం
ఫ్రెండ్ షిప్ క్లబ్బుల్లో సభ్యత్వం కల్పిస్తామని, పురుష, మహిళా ఎస్కార్ట్లుగా అవకాశం కల్పిస్తామంటూ వంచించిన ఘరానా మోసగాడిని నగర సీసీఎస్ పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన గోపు శ్రీనివాస్ ఓ ప్రకటన చూసి స్పందించాడు.
అందులో పేర్కొన్న నంబర్కు ఫోన్ చేయగా పల్లవి పేరుతో ఓ యువతి మాట్లాడింది. సభ్యత్వం కోసం రూ.3,600 చెల్లించాలని ఓ బ్యాంకు ఖాతా నంబరు సూచించింది. శ్రీనివాస్ నగదు ఖాతాలో వేయగానే దీక్షతో మాట్లాడమని చెప్పి పల్లవి వేరే ఫోన్ నంబరు ఇచ్చింది.
ఆ నంబరులో దీక్ష అలాగే మభ్యపెట్టి రూ.10వేలను ఖాతాలో వేయించుకుంది. అనంతరం రెండు ఫోన్ నంబర్లు పని చేయక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మీర్పేట నందిహిల్స్కు చెందిన గోవింద్ వెంకట్ రామన్(50)ను ఈ మోసంలో సూత్రధారిగా గుర్తించి శనివారం మీర్పేట బస్స్టాప్లో పట్టుకున్నారు.
అతడి భార్య గోవింద్ కృపారాణినే ఫోన్లలో పల్లవి, దీక్షలా మాట్లాడి బాధితుడిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాహెబ్ నగర్కు చెందిన హేమంత్ రాజ్, ఢిల్లీకి చెందిన అశుతోష్ల ఖాతా నంబర్లను వీరు వినియోగించినట్లు నిర్ధారించారు. ప్రతి లావాదేవీలో హేమంత్, అశుతోష్లకు 20శాతం కమీషన్ ఇచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు.