వారి కలయిక అనైతికం..! కేసీఆర్, జగన్ భేటీపై మండిపడ్డ బీజేపి..!!
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల కలయికపై తెలంగాణ బీజేపి స్పందించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ వెనకాల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు లేవని, ఇద్దరి స్వప్రయోజనాలే దాగి ఉన్నాయని కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి ఆర్థిక లావాదేవీలు, భూ దందాలను అడ్డదారుల్లో పరిష్కరించుకునేందుకే ఇరువురు తరుచుగా భేటీ అవుతున్నారని అన్నారు.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఇప్పటికే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, తర్వాత టార్గెట్ తెలంగాణే అన్నారు. ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు తీరు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, జగన్ లు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇద్దరూ ఎన్ని సార్లు భేటీ అయినా, ఇరు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోలేరని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే, ఇరు రాష్ట్రాల్లో చంద్రశేఖర్ రావు, జగన్ ప్రభుత్వాలను కూల్చి, బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి కాంగ్రెస్ ను వీడి కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో న్న విజయశాంతి అది పూర్తవ్వగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను సైతం ఆమె కలవనున్నారని సమాచారం.
మరోవైపు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న అమిత్ షా నిర్ణయంతో బీజేపీ జాతీయ నాయకులు సైతం రెండు సార్లు ఆమెతో సంప్రదింపులు జరిపారన్న వార్తలు గుప్పుమన్నాయి. గతంలో విజయశాంతి బీజేపీలో కూడా పనిచేశారు. దీంతో అప్పట్నుంచి ఇప్పటివరకు బీజేపీలోని కేంద్ర నేతలతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆమె వాటిని అలానే కొనసాగిస్తున్నారని అనుచరులు అంటున్నారు.రెండు మూడు మాసాల్లో విజయశాంతి రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు.