నయీం ను అప్పట్లో బెదిరించా.. కానీ..! ఆర్ కృష్ఱయ్య సంచలన వ్యాఖ్యలు..!!
హైదరాబాద్: అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు కూడా నయీం గ్యాంగ్ తో సంబందాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. దీనిపై నార్సీంగ్ పోలీసులు రెండు గంటల పాటు ఆర్ కృష్ణయ్యను విచారించారు కూడా. ఇలా నయీం ఇష్యులో టిడిపి నేతలకు సంబందాలు ఉండడంతో పార్టీకి కొంత డ్యామెజ్ అయిందని వార్తలు వచ్చాయి.
ఇదే అంశం పై తాజాగా బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్ కృష్ణయ్య మరో సారి తెరమీదకు వచ్చారు. నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై ఆర్. కృష్ణయ్య వివరణ ఇచ్చారు. నయీం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. నయీం బాధితుల పక్షాన మాత్రమే మాట్లాడానని అన్నారు.
కాగా నయీం విషయంలో తనకు తెలిసిన విషయాలు అప్పట్లోనే చెప్పానన్నారు. నయీంతో సంబంధాలున్న చాలా మందిని వదిలేశారని ఆరోపించారు. తన దగ్గరకు రోజూ చాలా మంది వస్తారని, వాళ్ల తరఫున కాల్ చేసి నయీం ను బెదిరించానని అన్నారు. తన పేరును ఛార్జ్ షీట్లో పెట్టడాన్ని ఖండించారు. తాను ఎలాంటి దందాలు చేయలేదన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే.. తన పేరును ఛార్జ్ షీట్లో చేర్చారని ఆరోపించారు. బీసీల పక్షాన పోరాటం చేయకుండా తనను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. నయీం కేసులో దొరికిన డబ్బును బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటం చేసే వారిని బెదిరించడం తప్ప ఏమీ చేయడం లేదన్నారు. నయీం డైరీని బయటపెట్టాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే అన్నీ బయటికి వస్తాయన్నారు.